నిత్యం భక్త జన నీరాజనాలు అందుకుంటున్న వైనతేయ నది తీరాన అప్పనపల్లిలో కొలువైవున్న శ్రీబాలబాలాజీ స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రోచ్ఛారణలతో వేద పండితులు, అర్చకస్వాములు , దేవస్థాన సిబ్బంది మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి దివ్య తిరు కల్యాణానికి శ్రీకారం చుట్టారు .
కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో కొలువై వున్న శ్రీ బాలబాలాజీ స్వామివారి దివ్య కల్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది . స్వామి వారి దివ్య కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు రాష్ట్రం నలుమూలలనుండి అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణ తో సుందరంగా ముస్తాబు చేశారు. ఈ ఉత్సవానికి గాను నవీన ఆలయానికి ఉత్తరం వైపున కళ్యాణ వేదికను నయనానందకరంగా తీర్చిదిద్దారు.
వేసవిని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు మంచి నీరు , ఉచిత అన్నదాన వసతి కల్పించారు. ప్రభుత్వం తరపున స్వామి వారికి పి.గన్నవరం శాసనసభ్యులు కొండేటి చిట్టిబాబు, కోనసీమ కలెక్టర్ హిమాన్సు శుక్లా, ఏసీ ఇపి బాబు రావు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దలి తిరుమల సింగరాచార్యులు, త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి వారి అర్చక బృందం ఆధ్వర్యంలో స్వామివారితో పాటు ఉభయ దేవేరులను బుగ్గన చుక్కపెట్టి వారిని పెళ్ళికొడుకు , పెళ్ళికుమార్తెలుగా తీర్చిదిద్ది వారిరువురిని కళ్యాణమంటపం తీసుకువచ్చి వేదమంత్రాలతో , మంగళ వాయిద్యాల నడుమ దివ్య తిరుకళ్యాణం జరిపించారు. ఈ కమనీయ, రమణీయ కల్యాణోత్సవం తిలకించడం తమ పూర్వజన్మ సుకృతంగా భావించారు భక్తకోటి.
Dwarakatirumala: 2 వేలు విరాళం ఇస్తే… 8 కోట్లు ఇచ్చినట్టు లెక్కలు