కుటుంబ సభ్యుల మధ్య ఆస్తుల పంపకాల డీడ్ రిజిస్ట్రేషన్లల్లో కోల్పోతున్న ఆదాయంపై ఏపీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఫోకస్ పెట్టింది. వాటాల విలువను తగ్గించి చూపుతున్న కారణంగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఆదాయం కోల్పోతున్న లావాదేవీల్లో నిబంధనలు సవరిస్తూ మెమో జారీ చేసింది. పూర్వీకుల నుంచి సంక్రమించిన ఆస్తుల వాటాల పంపకాల్లో సరైన స్టాంపు డ్యూటీ చెల్లించక పోవడంతో ఖజానాకు నష్టం వాటిల్లుతోందని గుర్తించిన ప్రభుత్వం… హిందూ వారసత్వ చట్టం, భారత వారసత్వ చట్టాలను అనుసరించకుండా తగ్గించిన విలువతో స్టాంపు డ్యూటీలు వసూలు చేస్తున్నట్టు గుర్తించింది.
వారసత్వంగా వచ్చిన ఆస్తిని వారసులు సమాన వాటాలుగా పంపకాలు చేస్తే.. అన్నీ డీడ్లకు స్టాంప్ డ్యూటీ వసూలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వారసత్వపు ఆస్తిని కుటుంబ సభ్యులు సమాన వాటాలుగా పంచుకోకపోతే గరిష్ట వాటాకు 1 శాతం స్టాంపు డ్యూటీ మినహాయించి లెక్కించాలని సూచింది. అన్ని వాటాల డీడ్ లకు రిజిస్ట్రేషన్ చార్జీలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా లావాదేవీల్లో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాల్సిందిగా అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఆదేశాలు వెళ్లాయి. ప్రభుత్వ నిర్ణయంతో భారీ ఎత్తున ఆదాయం వస్తుందని అధికారుల అంచనా వేస్తున్నారు.