ఏపీలో అమరావతి రాజధాని రైతులు న్యాయస్థానం టూ దేవస్థానం పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మహా పాదయాత్రకు అనుమతి ఇచ్చింది హైకోర్టు. రాజధాని రైతులు అనుమతి కోసం వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు ప్రభుత్వ న్యాయవాది. పోలీసులు అనుమతి నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వుల్లో సహేతుకమైన కారణాలు లేవని వివరించారు న్యాయవాది వి.లక్ష్మీనారాయణ.
పాదయాత్రకు అనుమతిస్తే అభ్యంతరం ఏమిటని ప్రశ్నించింది హైకోర్ట్. రైతుల పాదయాత్రపై గ్రామాల్లో రాళ్లు వేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ న్యాయవాది. దీని వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని కోర్టుకి తెలిపారు. రైతులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటారని చెప్పారు న్యాయవాది లక్ష్మీనారాయణ. దీంతో పాదయాత్రకు షరతులతో అనుమతించింది హైకోర్టు.