కరోనా కష్టకాలం కనీసం మానవత్వాన్ని చూపకుండా.. అందినకాడికి దండుకునే దందా కొనసాగిస్తున్నాయి ప్రైవేట్ ఆస్పత్రులు.. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల కోవిడ్ దందాపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.. తప్పిదాలకు పాల్పడిన ప్రైవేట్ ఆస్పత్రులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సిద్ధమవుతోంది.. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్.. ఇప్పటికే నిబంధనలు పాటించని చాలా ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నాం.. ఫైన్లు కూడా వేశామన్నారు.. కోవిడ్ పేషంట్ల నుంచి ఎక్కువ డబ్బులు తీసుకోవడం కరెక్ట్ కాదని ప్రభుత్వం భావిస్తోందన్న ఆయన.. రెెండో సారి ఆస్పత్రి యాజమాన్యాలు తప్పులు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో జరిగే ట్రీట్మెంట్.. బిల్లింగ్ పై నోడల్ ఆఫీసర్లు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తారని తెలిపారు.
ఇక, మూడో దశ కోవిడ్ వస్తే ఏం చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు అనిల్ కుమార్ సింఘాల్.. మూడో దశ కరోనాలో పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అంచనాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్న ఆయన.. మూడో దశ కోవిడ్ను ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నామని.. కమిటీ వేసుకున్నామని వెల్లడించారు.. మరోవైపు.. పాజిటివిటీ రేట్ రోజు కంటే తగ్గిందన్న ఆయన.. ఇవాళ 19 శాతం మేర పాజిటివిటీ రేట్ నమోదైందని.. ఐసీయూ బెడ్లు 812, ఆక్సిజన్ బెడ్లు 3552 అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. కోవిడ్ కేర్ సెంటర్లల్లో 16689 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక, పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యే వారి సంఖ్య పెరిగిందని.. అడ్మిషన్లు తక్కువగా ఉన్నట్టు చెప్పారు అనిల్ కుమార్ సింఘాల్.