పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీ విరమణ తర్వాతే ఉద్యోగులకు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 11వ పీఆర్సీలో ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకొచ్చింది. పీఆర్సీ బకాయిలను ఇప్పటి వరకు PF, GPF ఖాతాల్లో జమ చేస్తుండగా.. ఇప్పుడు మాత్రం రిటైర్మెంట్ తర్వాతే చెల్లిస్తామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 2019 నుంచి 31 మార్చి 2020 వరకు ఇచ్చిన ఐఆర్ రికవరీని నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 2020-డిసెంబర్ 2021 వరకు రావాల్సిన 21 నెలల పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీ విరమణ సమయంలో ఇస్తామని ప్రభుత్వం పేర్కొంది.
మరోవైపు ప్రభుత్వ పింఛనుదార్లకు ఏప్రిల్ 2020 నుంచి డిసెంబరు 2021 వరకు రావాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిలను 2023 జనవరి నుంచి నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జులై 2019 నుంచి 31 మార్చి 2020 వరకు ఐఆర్ రికవరీ ఉండదని స్పష్టం చేసింది. పీఆర్సీ ఆర్థిక ప్రయోజనం జనవరి 2022 నుంచి ఇస్తామని పేర్కొంది. అటు ఉద్యోగులకు పీఆర్సీని ఐదేళ్లకే అమలు చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగి, పెన్షనర్, ఫ్యామిలీ పెన్షనర్ చనిపోతే ఇచ్చే మట్టి ఖర్చుల మొత్తాన్ని రూ.25 వేలకు పెంచారు. జనవరి 2022 నుంచి ఇది వర్తిస్తుంది.
కాగా పీఆర్సీ, డీఏ బకాయిలను పదవీ విరమణ సమయంలో ఇస్తామనడాన్ని ఉద్యోగ సంఘాల నేతలు వ్యతిరేకించారు. రెండు, మూడేళ్లలో పదవీ విరమణ పొందే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని,.. 15-20 ఏళ్ల సర్వీసు ఉన్నవారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని, చర్చల సమయంలోనూ దీన్ని చెప్పలేదని ఆరోపించారు.