CM Jagan: కందుకూరు టీడీపీ సభలో తొక్కిసలాట ఘటనపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జోగునాథునిపాలెం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ఫోటో షూట్ కోసం, డ్రోన్ షాట్ కోసమే కందుకూరు సభ అని మండిపడ్డారు. 8 మందిని చంపేశారు.. ఇంతకంటే ఘోరం ఉంటుందా అని ప్రశ్నించారు. గోదావరి పుష్కరాల్లోనూ షూటింగ్ కోసం 29 మంది ప్రాణం తీశారని ఆరోపించారు. అప్పుడు కూడా ప్రజలు ఇదేం ఖర్మరా బాబు అనుకున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయం అంటే షూటింగులు, డైలాగులు కాదని.. రాజకీయం అంటే డ్రోన్ షాట్లు కాదని చురకలు అంటించారు. రాజకీయం అంటే డ్రామాలు అంతకంటే కాదన్నారు. రాజకీయం అంటే పేద కుటుంబాల్లో మంచి మార్పు తీసుకురావడమే అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
Read Also: CM Jagan Mohan Reddy: చేసేది చెబుతున్నాం.. ప్రతిమాట నిలబెట్టుకుంటాం
కాగా అనకాపల్లి జిల్లాలో జరిగిన సభలో చంద్రబాబుపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అవుతోందని.. ఏ మంచి జరిగినా తానే చేశానని చెప్పుకోవడం ఆయన నైజం అని ఎద్దేవా చేశారు. చివరకు పీవీ సింధు బ్యాడ్మింటన్లో గెలిచినా సింధుకు బ్యాడ్మింటన్ ఆడటం నేర్పించిందే తానని చెప్పుకుంటాడని విమర్శలు చేశారు. ఇది చంద్రబాబు మార్క్ స్టైల్ అని ఆరోపించారు. 73 ఏళ్ల ముసలాయనను చూస్తే గుర్తొచ్చేవి రెండే స్కీములు అని.. ఒకటి వెన్నుపోటు.. రెండోది మోసాలు అని చురకలు అంటించారు. గత పాలకుల వల్ల నర్సీపట్నంలో అభివృద్ధి జరగలేదని సీఎం జగన్ అన్నారు. ఇవాళ రూ.986 కోట్ల పనులకు శంకుస్థాపన చేశామని.. మెడికల్ కాలేజీ వస్తే 150 మెడికల్ సీట్లు వస్తాయన్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ వస్తుందని సీఎం జగన్ అన్నారు.