Andhra Pradesh: అమరావతిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను ఏపీకి చెందిన అంతర్జాతీయ ఫెన్సింగ్ క్రీడాకారిణి మురికినాటి బేబి రెడ్డి, పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్ షేక్ అర్షద్, కోచ్ ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఫౌండర్ ఆదిత్య మెహతా కలిశారు. వీరిలో ఫెన్సింగ్ క్రీడాకారిణి బేబి రెడ్డి స్వస్ధలం అన్నమయ్య జిల్లా చెన్నముక్కపల్లె, పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్ ఛాంపియన్ షేక్ అర్షద్ స్వస్ధలం నంద్యాల. ఈ సందర్భంగా అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకంగా అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. క్రీడలకు మరింతగా ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం జగన్ వివరించారు.
Read Also: ఇంట్లో పూజించే గణేష్ విగ్రహాలు ఎంత సైజ్లో ఉండాలి?
ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్ (జూనియర్స్ టీమ్)లో బేబి రెడ్డి టీమ్ కాంస్య పతకం గెలవడంతో ఆయా పతకాలను ఆమె సీఎం వైఎస్ జగన్కు చూపించారు. జాతీయ స్ధాయిలో టీమ్ పరంగా, వ్యక్తిగతంగా పతకాలు సాధించినట్లు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అటు ఇటీవల ఢిల్లీలో జరిగిన పారా ఏషియన్ ట్రాక్ సైక్లింగ్లో షేక్ అర్షద్ వెండి, కాంస్య పతకాలు సాధించాడు. దీంతో తాను జాతీయ స్థాయిలో సాధించిన పతకాలను సీఎంకు చూపించాడు. అక్టోబర్లో ఫ్రాన్స్లో జరగనున్న ట్రాక్ వరల్డ్కప్లో పాల్గొంటున్నట్లు సీఎంకు వివరించాడు. తమకు ప్రభుత్వం నుంచి మరింత సహకారం ఇవ్వాలని బేబిరెడ్డి, షేక్ అర్షద్ సీఎం జగన్కు విజ్ఞప్తి చేశారు. దీంతో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. అటు ముఖ్యమంత్రి జగన్ను బేబి రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి, కుటుంబ సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, వెంకట్రామి రెడ్డి, అర్షద్ కోచ్ ఆదిత్య మెహతా కూడా మర్యాదపూర్వకంగా కలిశారు.
