NTR Bharosa Pensions: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచిన పెన్షన్లను ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేయనున్నారు. రేపు (ఆగస్ట్ 1న) ఉదయం ఆరింటి నుంచి ఊరురా తిరిగి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పెంచిన పెన్షన్ మొత్తాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, మంత్రులు పాల్గొనాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఆగస్టు నెలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం రూ.2,737.41 కోట్లను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 64. 82 లక్షల మందికి రేపు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీని ప్రారంభించాలని సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి 1వ తేదీన 96 శాతం, 2న 100 శాతం పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వృద్ధులు, వితంతువులకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు అందిస్తున్నారు.
Read Also: Wayanad Landslides : వాయనాడ్లో ప్రకృతి విధ్వంసం… ఇప్పటివరకు 151 మంది మృతి
ఇక, సీఎం చంద్రబాబు ఆగస్టు 1వ తేదీన సత్యసాయి జిల్లాలో పర్యటించనున్నారు. మడకశిర మండలం గుండుమలలో లబ్ధిదారులకు ఇంటి దగ్గరే పింఛన్లు అందజేయనున్నారు. మల్బరీ నాట్లు, పట్టు పురుగుల షెడ్లను కూడా పరిశీలిస్తారు. కరియమ్మదేవి ఆలయాన్ని సందర్శించి, గ్రామస్థులతో సీఎం మాట్లాడనున్నారు. అదే రోజు శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని, ప్రాజెక్టు దగ్గర జలహారతి ఇవ్వనున్నారు.