ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. మొదటి పరీక్ష మొదలైనప్పటి నుంచి ప్రశ్నాపత్రాలు ఏదో ఒక చోట లీక్ అవుతూనే ఉన్నాయి. నంద్యాల, చిత్తూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో జరిగిన పేపర్ లీకేజ్ ఘటనల్ని ఇంకా మరువకముందే.. మరోసారి కృష్ణా, కర్నూలు జిల్లాల్లో పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారింది. సోమవారం మ్యాథ్స్ పేపర్ సెల్ఫోన్లో ప్రత్యక్షం అవ్వడంతో.. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.
Read Also: IMD: వాతావరణశాఖ చల్లని కబురు.. మూడు రోజులు వర్షాలు..!
ఈ పేపర్ లీక్ అయిన విషయం తెలిసి, జిల్లా ఎస్పీ సీరియస్ అయ్యారు. యువకుల్ని అదుపులోకి తీసుకొని విచారించగా.. తామే స్వయంగా పరీక్ష పత్రాలు ఫోటోలు తీసుకొచ్చినట్టు వాళ్ళు అంగీకరించారు. కాపీ చిట్టీలు మార్చుకుంటున్న సమయంలో, ఆ యువకులు అడ్డంగా దొరికారు. సెల్ఫోన్ తీసి పరిశీలిస్తే, ప్రశ్నాపత్రం లీకైన మేటర్ వెలుగులోకి వచ్చింది. దీని వెనుక ఎవరి హస్తముందో విచారించాలని ఎస్పీ ఆదేశించారు. మరోవైపు.. వరుసగా ఈ లీకేజ్ ఘటనలు వెలుగుచూస్తుండడంతో, ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
ఇప్పటివరకు ఈ పత్రాల్ని లీక్ చేసిన 42 మంది టీచర్లు అరెస్ట్ అవ్వగా.. ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. ఉద్దేశ్యపూర్వకంగా మాల్ ప్రాక్టీస్ వ్యవహారాలు జరుగుతున్నాయని విద్యా శాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ ఇది నిజమేనని రుజువైతే, ఆయా టీచర్స్ని విధుల నుంచి తొలగించాలని విద్యా శాఖ యోచిస్తోంది. ఈ మాల్ ప్రాక్టీస్ ఎపిసోడుపై మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి విద్యా శాఖ సిద్ధమవుతోంది.