ఇక, క్షేత్రస్థాయిలో పర్యటనలకు సిద్ధం అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్పందన వీడియో కాన్ఫరెన్స్లో దీనిపై సంకేతాలు ఇచ్చారు.. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమన్న ఆయన.. అలసత్వం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వచ్చే నెల నుంచి ఎమ్మెల్యేలు సచివాలయాలను సందర్శించాలని ఆదేశించిన సీఎం జగన్.. డిసెంబర్ నుంచి నేను కూడా సచివాలయాలను సందర్శిస్తానని తెలిపారు. స్పందన వీడియో కాన్ఫరెన్స్లో గృహనిర్మాణం, ఉపాధిహామీ పనులు, వైయస్సార్ అర్బన్ క్లినిక్స్, గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు, కోవిడ్ సహా సీజనల్ వ్యాధులు, దిశా యాప్, వ్యవసాయం, అక్టోబరులో నెలలో అమలు చేయనున్న పథకాలపై సమీక్ష నిర్వహించారు.
ఇక, ఇళ్లపట్టాల పంపిణీపై కోర్టుల్లో పెండింగ్ కేసులపై దృష్టిపెట్టాలన్నారు సీఎం వైఎస్ జగన్.. గత వీడియో కాన్ఫరెన్స్లో 834 కేసులు ఉంటే.. ఇవాళ్టికి 758కి కేసులు తగ్గాయని.. 76 కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు.. దాదాపుగా 8వేల మందికి దీనివల్ల మేలు జరిగిందన్న సీఎం.. ఏజీతో నేను కూడా రెగ్యులర్గా మాట్లాడుతున్నానని.. ఈ కేసులు పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకోవాలిన అడిగినట్టు వెల్లడించారు.. వచ్చే నెలరోజుల్లో ఈ కేసులన్నీ పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నా అన్నారు. లే అవుట్ వారీగా, ప్లాట్ల వారీగా లబ్ధిదారుల వివరాలను తెలియజేస్తూ మ్యాపింగ్ చేశామన్న ఆయన.. మిగిలిపోయిన 12.6శాతం మ్యాపింగ్ పనులను కలెక్టర్లు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. 1,48,398 మందికి పట్టాలు ఇవ్వడానికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉందన్నారు. 1980 నుంచి 2011 వరకూ ఉన్న అన్ని ఇళ్లు, ఇంటి స్థలాలను విడిపించుకునేలా అవకాశం ఇస్తున్నాం.. ఆ ఆస్తులపై వారికి పూర్తి హక్కులు వస్తాయన్నారు.. పేదలందరికీ ఇళ్ల పథకలో భాగంగా మొదటివిడతలో 15. 6 లక్షల ఇళ్లు కడుతున్నాం.. ఇప్పటి వరకు 10.31 లక్షల ఇళ్లు గ్రౌండ్అయ్యాయని.. ఆప్షన్ –3ని ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులు అక్టోబరు 25 నుంచి మొదలుపెట్టడానికి అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే 2.25 లక్షల లబ్ధిదారులతో 18,483 గ్రూపులు ఏర్పాటు చేశారని.. ఈ నెలాఖరు కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తికావాలన్నారు.