ఆంధ్రప్రదేశ్లో కరెంట్ పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం వైఎస్ జగన్.. రాష్ట్రంలోని వివిధ థర్మల్ కేంద్రాల నుంచి కరెంటు ఉత్పత్తి, బొగ్గు నిల్వలపై ఆరా తీశారు.. థర్మల్ కేంద్రాలను పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిపించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఏపీ సీఎం.. దేశంలో బొగ్గు నిల్వలు ఎక్కడ ఉన్నా వాటిని తెప్పించుకోవడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించిన ఆయన.. కావాల్సిన బొగ్గు కొనుగోలు చేయాలని, ఎలాంటి నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఇక, ఇప్పుడున్న ధర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తిని ప్లాంట్ల సామర్థ్యం మేరకు పెంచాలని ఆదేశించారు సీఎం జగన్.
కృష్ణపట్నం, వీటీపీఎస్లో ఉన్న కొత్త యూనిట్లలో వెంటనే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.. వీటి వల్ల 1600 మెగావాట్ల విద్యుత్ను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆయన.. సింగరేణి సంస్థతో కూడా సమన్వయం చేసుకుని అవసరాల మేరకు బొగ్గును తెప్పించుకోవాలన్నారు.. కేంద్రంలోని సంబంధిత మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించియన ఆయన.. కరెంటు కోతలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.