ఆపదలో ఉన్నాం.. ఆదుకొండి అంటూ వస్తే తాను ఉన్నానంటూ భరోసా కల్పిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సొంత జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ.. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండి.. వైద్యం చేయించుకోవడం కష్టమైన వారికి భరోసా ఇచ్చారు.. అనంతపురం జిల్లా, నార్పల మండలం, గూగుడు గ్రామానికి చెందిన జగన్మోహన్ రెడ్డి అనే రైతు బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడు.. ఈ విషయానికి ఆయన భార్య శివజ్యోతి తమ ముగ్గురు పిల్లలు సౌమ్య, హరిప్రియ, యమినితో కలిసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి అర్జీ సమర్పించారు. నవంబర్ 12వ తేదీ నుండి ఆస్టర్ సి.ఎం.ఈ బెంగళూరు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నా భర్తకు రూ. 20 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పారని సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఆమె.. మీరే ఆదుకోవాలంటూ బోరున విలపించింది.. ఇక, తాను ఉన్నానంటూ మాట ఇచ్చిన సీఎం.. తక్షణమే రూ.2లక్షలు మీ అకౌంట్ లోకి వేస్తామని, పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరించి చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు..
Read Also: ED Raids: ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం.. నిధులు పక్కదారి..!
మరోవైపు, పులివెందులలో నివసిస్తున్న కె శివకుమార్, టైలరింగ్ చేసుకుంటూ భార్య జి.వరలక్ష్మి, ఇద్దరు పిల్లలు హైందవ్ (8), కుషల్ (5)తో జీవనం సాగిస్తున్నారు.. అయితే, ఆ ఇద్దరు పిల్లలు తీవ్ర మైన అనిమియా వ్యాధితో బాధపడుతున్నారు.. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.. వారికి రక్తం పెరుగుదలకు ఇంజక్షన్ వాడుతున్నామన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు తిరుగుతున్నామని.. ఈ వ్యాధి ఆరోగ్య శ్రీ కిందకు రాదన్నారని ప్రస్తుతం హైదరాబాద్ లోని అమెరికన్ అంకాలజిస్ట్ దగ్గర చికిత్స చేయిస్తున్నామని.. ఇప్పటికే రూ.15 లక్షలు ఖర్చు చేశామని.. సర్వం కోల్పోయాం.. మీరే మమ్మల్ని, మా పిల్లల్ని ఆదుకోవాలని సీఎం జగన్కు విన్నవించుకున్నారు.. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిల్లల ఆరోగ్యానికి మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారు.
కాగా, నిన్ననే ఓ బాలుడి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని.. మీరు నిశ్చితంగా ఉండాలంటూ తన దగ్గరకు వచ్చిన తల్లిదండ్రులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చిన విషయం విదితమే.. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం చిగిచర్లకు చెందిన దివాకరరెడ్డి దంపతుల కుమారుడు యుగంధర్ రెడ్డి మూడున్నర సంవత్సరాల చిరు ప్రాయంలోనే లివర్ దెబ్బతింది . చాలామంది వైద్యుల వద్దకు తిరిగారు. వైద్యుల సూచనలతో బెంగుళూరులోని సెయింట్ జాన్ ఆస్పత్రికి వెళ్లారు. ఏడు నెలలపాటు తిరిగి అన్ని పరీక్షలు చేయించారు. లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని , పెద్ద మొత్తంలో ఖర్చవుతుందని వైద్యులు తెలియజేశారు. పేదలైన దివాకర్ రెడ్డి కుటుంబం అంత పెద్ద మొత్తంలో వెచ్చించలేని పరిస్థితి.. దీంతో, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని కలిశారు. ఆయన శుక్రవారం లింగాల మండలం పార్నపల్లెకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు బాధిత కుటుంబాన్ని తీసుకుని వచ్చారు. దివాకర రెడ్డి దంపతులు తమ కుమారుడి అనారోగ్య పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు. వెంటనే స్పందించిన సీఎం జగన్.. వైద్యానికి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని, మీరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ వారికి భరోసా ఇచ్చారు. తక్షణమే బాలుడికి వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయరామరాజును ఆదేశించారు. దీంతో దివాకర్రెడ్డి దంపతులు ఆనంద బాష్పాలతో ముఖ్యమంత్రికి చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు.