ఏపీలో వివిధ శాఖలకు కొత్త మంత్రులు వచ్చారు. రాష్ట్రంలో కీలకంగా భావించే ఇరిగేషన్ శాఖకు పార్టీ సీనియర్ నేత, అధికారప్రతినిధి అంబటి రాంబాబు మంత్రిగా వచ్చారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖా మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవిని ముఖ్యమంత్రి నాకు అప్పగించారు. సమర్ధవంతంగా నా బాధ్యతను పూర్తి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరం విషయంలో పూర్తి చేసేందుకు కృషి చేస్తా. రాయలసీమ సాగు నీటి విషయంలో కూడా చర్యలు తీసుకుంటాం. పోలవరం పూర్తయితే రాయలసీమకు మేలు జరుగుతుందన్నారు మంత్రి అంబటి రాంబాబు. వైసీపీలో కొత్త మంత్రి వర్గ విస్తరణ వల్ల ఏర్పడిన అసంతృప్తి తాత్కాలికమే అన్నారు. అంతా సర్దుకుంటుందన్నారు. ఐదేళ్ళూ ఒకే మంత్రి వర్గం ఉండాలన్నది సరైంది కాదు. ఎవరికి ఏ పోర్టు ఫోలియో ఇవ్వాలి, మార్పులు చేర్పులు అనేవి ముఖ్యమంత్రి ఇష్టం. అన్ని శాఖలు ముఖ్యమంత్రి పరిధిలో ఉంటాయన్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా అంబటి ఎలాంటి మార్క్ చూపిస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అవసరం మేరకు పోర్టు పోలియోలు మార్చిన సందర్భాలు ఉన్న విషయాన్ని అంబటి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదేళ్లే కాక, రాబోయే ఐదేళ్లలో ఆయనే మఖ్యమంత్రి అన్నారు. ఇప్పుడు అవకాశాలు రానివారు వచ్చే మంత్రి వర్గంలో స్థానం దక్కించుకుంటారని ఆయన చెప్పారు. ఇరిగేషన్ శాఖలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేశాక, కార్యాచరణకు దిగుతానని అంబటి రాంబాబు చెప్పారు.