Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ సంస్థాగత బలోపేతంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామ, వార్డు స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేశామని తెలిపారు. అనుబంధ విభాగాలను స్వతంత్రంగా, క్రియాశీలకంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇక, ప్రతి అనుబంధ విభాగం, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నామని సజ్జల తెలిపారు. ఆయా వర్గాల అభిప్రాయాలను సేకరించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామని పేర్కొన్నారు.
జగన్ పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పార్టీలో చేసే పనికి గుర్తింపు వచ్చేలా నాయకులు బాధ్యతతో వ్యవహరించాలని సజ్జల సూచించారు సజ్జల… “ఇది నా పార్టీ” అనే భావనతో ప్రతి నాయకుడు పనిచేయాలని కోరారు. ప్రజలతో మమేకం కావడం, వారి సమస్యలను తెలుసుకోవడం విజయానికి కీలకమని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సజ్జల పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ సంక్షేమం, ప్రస్తుత ప్రభుత్వ పాలన మధ్య తేడాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. జగన్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి రెండూ సమాంతరంగా సాగాయని అన్నారు.
రాష్ట్రాన్ని నంబర్ వన్గా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఐబీ సిలబస్, మెడికల్ కాలేజీలు, ఆరోగ్యం, విద్య రంగాల్లో వైసీపీ ప్రభుత్వం భారీ మార్పులు తీసుకువచ్చిందని సజ్జల పేర్కొన్నారు. ఐదేళ్లలో 15 ఏళ్ల అభివృద్ధిని చూపించామని అన్నారు. పార్టీ లోపాలను సరిదిద్దుకుంటూ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్గా నిలబెట్టడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి..

