Minister Ramprasad Reddy: అది విజ్ఞప్తి.. ఆదేశం కాదు.. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చొద్దు..

Mandipalli Ramprasad Reddy

Mandipalli Ramprasad Reddy

Minister Ramprasad Reddy: ఆంధ్రప్రదేశ్‌లో గణేష్ నిమజ్జనంలో డీజే వాహనాలకు అనుమతుల అంశంపై మంత్రి నారా లోకేష్ చేసిన విజ్ఞప్తిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. లోకేష్ ఎవరినీ ఆదేశించలేదని, కేవలం ప్రజలు, భక్తుల తరఫున విజ్ఞప్తి మాత్రమే చేశారని తెలిపారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర భక్తి భావంతో, ప్రశాంతంగా సాగాలన్నదే లోకేష్ ఉద్దేశమని పేర్కొన్నారు. నిమజ్జన యాత్రలో భక్తి సామరస్యానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని కోరడంలో తప్పేముందని రాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. ఒక మంత్రి చేసిన ప్రజాహిత విజ్ఞప్తిని ఆదేశంగా వక్రీకరించడం సమంజసం కాదన్నారు. లోకేష్ మాటల్లోని ఆప్యాయతను చూడాలని, ఆయన ఆదేశాలు జారీ చేసినట్టుగా చిత్రీకరించడం సరికాదని పేర్కొన్నారు.

భక్తుల విశ్వాసాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను గౌరవించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గణేష్ నిమజ్జనం సజావుగా, ప్రశాంతంగా జరిగేలా చూడాలని కోరితే అందులో ప్రొటోకాల్ ఉల్లంఘన ఎక్కడుందని ప్రశ్నించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడమే ప్రజాప్రతినిధుల బాధ్యత అని, అదే లోకేష్ చేశారని తెలిపారు. ప్రతి మాటలో తప్పులు వెతకడం, ప్రతి విజ్ఞప్తిని ఆదేశంగా చిత్రీకరించడం సమంజసం కాదని రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించారు. మాజీ ఐఏఎస్ అధికారి హోదాలో ఉన్న వ్యక్తి వాస్తవాలను పరిశీలించి మాట్లాడితే బాగుంటుందని అన్నారు. భక్తి కార్యక్రమాన్ని రాజకీయ వివాదంగా మార్చే ప్రయత్నాలను మానుకోవాలని సూచించారు. గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా, భక్తి సామరస్యంతో సాగడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. నిమజ్జన కార్యక్రమాలు సజావుగా జరిగేలా భక్తులు, నిర్వాహకులు, అధికారులు పరస్పరం సహకరించాలని ఆయన కోరారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..