JC Prabhakar Reddy Meets YS Vijayamma: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.. హైదరాబాద్ వెళ్లిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మను కలిశారు.. హైదరాబాద్ లోటస్పాండ్లోని విజయమ్మ నివాసానికి వెళ్లి భేటీ అయిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆమెతో అప్యాయంగా మాట్లాడారు.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, వైఎస్ హయాంలో జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న విషయం విదితమే.. వైఎస్ కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు జేసీ దివాకర్రెడ్డి.. అయితే, వైఎస్ రెండో కేబినెట్లో జేసీ కుటుంబానికి మంత్రి పదవి దక్కలేదు..
Read Also: MQ-9B Drones: ‘హంటర్-కిల్లర్స్’ కొనుగోలుకు భారత్ ప్రతిపాదన..ఉగ్రవాదులకు చుక్కలే..!
ఇక, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఫ్యామిలీలు కాంగ్రెస్ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. 2014 ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా బరిలోకి దిగి గెలుపొందారు.. ఆ త్వాత ఎన్నికల్లో వారి వారసులను బరిలోకి దింపినా.. విజయం సాధించలేదు.. ఇక, వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ ట్రావెల్స్పై, తమపై కేసులు పెట్టి.. తీవ్రంగా వేధించారని జేసీ దివాకర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం విదితమే.. ఈ కేసుల్లో జేసీ ప్రభాకర్రెడ్డి జైలు జీవితాన్ని కూడా గడిపారు.. జేసీ ట్రావెల్స్ కేసుల విషయంలో.. అధికారులపై కేసులు పెడతానంటూ హెచ్చరిస్తూ వస్తున్నారు జేసీ.. మరో వైపు తాజా ఎన్నికల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో పాటు.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. అయితే, జేసీ ప్రభాకర్రెడ్డి ఇప్పుడు వైఎస్ విజయమ్మను కలవడం ఆసక్తికరంగా మారింది. తమ బద్ధ శత్రువు అయిన వైఎస్ జగన్ తల్లి విజయమ్మను జేసీ ప్రభాకర్రెడ్డి ఎందుకు కలిశారు..? ఏం మాట్లాడారు అనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారిపోయింది.