YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్‌, డీజిల్‌పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్‌ డిమాండ్‌

Ys Jagan

Ys Jagan

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరోసారి పెట్రోల్‌, డీజిల్ ధరల అంశం చర్చనీయాంశంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీగా గత రెండేళ్లుగా తాము ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నిస్తున్నామని జగన్‌ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్‌, సూపర్ సెవెన్‌తో పాటు మొత్తం 143 హామీల అమలు గురించి ప్రజలు కూడా సమాధానం కోరుతున్నారని అన్నారు.

“పెట్రోల్‌, డీజిల్ ధరల విషయంలో వెన్నుపోటు”
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకోలేదని జగన్ విమర్శించారు. 2014-19 మధ్య కాలంలో కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితులు లేకపోయినా, 2015 ఫిబ్రవరిలో లీటర్‌కు రూ.4 చొప్పున పెట్రోలు, డీజిల్‌పై అదనపు భారం మోపారని గుర్తు చేశారు. అయితే తమ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి విపత్కర పరిస్థితులు ఉన్నప్పటికీ, చంద్రబాబు పెంచిన దానికంటే కేవలం ఒక్క రూపాయి మాత్రమే అదనంగా పెంచామని జగన్ పేర్కొన్నారు. ఆ సమయంలో చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేష్ తీవ్ర విమర్శలు చేశారని అన్నారు.

“ఇప్పటికే రూ.4 పెంచారు.. మరి రూ.8 తగ్గించాలి కదా?”
ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్‌పై ఉన్న పన్నులను తగ్గించి ధరలు తగ్గిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని జగన్ గుర్తు చేశారు. అదే విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారని అన్నారు. ప్రస్తుతం పెట్రోలు, డీజిల్‌పై ఇప్పటికే రూ.4 వరకు అదనపు భారం పెరిగిందని ఆరోపించిన జగన్‌, “చంద్రబాబు గతంలో చెప్పిన మాటల ప్రకారం ఇప్పుడు లీటర్‌కు కనీసం రూ.8 తగ్గించాలి కదా?” అని ప్రశ్నించారు.

కృత్రిమ కొరత సృష్టించారని ఆరోపణ
రాష్ట్రంలో ఇటీవల ఏర్పడిన పెట్రోలు, డీజిల్ కొరతపై కూడా జగన్ తీవ్ర విమర్శలు చేశారు. ఏప్రిల్ చివరి వారంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పెట్రోలు బంకుల వద్ద బారులు తీరారని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల అవసరాలు తీర్చాల్సిన ముఖ్యమంత్రి, అమరావతి కాంట్రాక్టర్లకు రిటైల్ అవుట్‌లెట్ల నుంచి పెట్రోలు, డీజిల్ ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాయడం దారుణమని జగన్ వ్యాఖ్యానించారు. బల్క్‌లో డీజిల్ కొనుగోలు చేస్తే ధర రూ.150 పైగా ఉంటుందని, కానీ రిటైల్ ధర రూ.101 మాత్రమే ఉండటంతో కొందరికి లాభం చేకూర్చే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు.

కేంద్రం చీవాట్లు పెట్టిందన్న జగన్
ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించిందని జగన్ తెలిపారు. రిటైల్ అవుట్‌లెట్ల నుంచి కమర్షియల్ అవసరాలకు ఇంధనం వాడకూడదని కేంద్రం స్పష్టం చేస్తూ రాష్ట్రానికి లేఖ రాసిందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై స్పందించకుండా సంక్షోభ సమయంలో కూడా స్కామ్‌లకు పాల్పడుతున్నారని ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి..