CM Chandrababu: ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. అనేక అంశాలపై స్పదించారు.. అన్నదాత సుఖీభవ, పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాలపై చర్చించిన ఆయన.. సింగపూర్ పర్యటన విశేషాలను నేతలకు వివరించారు.. చెప్పిన విధంగా హామీలు అమలు చేస్తున్నాం.. గత ప్రభుత్వానికంటే రెండింతలు సంక్షేమం ఇస్తున్నాం.. లబ్ధిదారుల సంఖ్య పెరిగింది.. ఆర్థిక చేయూతను పెంచాం. ఈ నెలలోనే సూపర్ సిక్స్ లోని రెండు హామీలు నెరవేరుస్తున్నాం. రేపు అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తున్నాం. ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం అమలు చేయనున్నాం. ప్రభుత్వం చేసే మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది పార్టీ యంత్రాంగమే. నిత్యం ప్రజల్లో ఉండాలి.. ప్రజల కోసం పని చేయాలి. ప్రజలు ఓట్లేస్తేనే మనం అధికారంలో ఉన్నామనే విషయాన్ని ఎప్పటికీ మరువొద్దు అని సూచించారు..
Read Also: Akhanda 2: బరిలో దిగాల్సిందే అంటున్న బాలయ్య
గత ఎన్నికల్లో మనకు ఓటేసిన వారు నిత్యం మనతోనే ఉండాలి.. మరింత మంది మన పాలనను మెచ్చాలన్నారు సీఎం చంద్రబాబు.. కష్టాలున్నా సంక్షేమం అమలు చేస్తున్నాం. రేపు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభించి మొదటి విడతగా రైతులకు రూ.7 వేలు జమచేస్తాం. ఇందులో రాష్ట్రం వాటా రూ.5 వేలు, కేంద్రం వాటా రూ.2 వేలు ఉంటుంది. 46,85,838 మంది రైతులకు లబ్ధి కలుగుతుంది. అన్నదాత సుఖీభవ పథకం కోసం రూ.2,342.92 కోట్లు విడుదల చేశాం. కేంద్రం రూ.831.51 ఇస్తోంది. అర్హులైన రైతుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోతే 155251 టోల్ ఫ్రీ నంబర్కు చేసి ఫిర్యాదు చేయవచ్చు. రైతు సంక్షేమం కోసం పని చేసే పార్టీ టీడీపీ.. మన జెండాలోనే నాగలి గుర్తు ఉంది. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక రూ.50లకే విద్యుత్ అందించారు. అన్నదాత బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.. ఇది మన పార్టీ సిద్ధాంతమని స్పష్టం చేశారు..
Read Also: IND- US Defense Deals: ట్రంప్ టారిఫ్ వివాదం.. F-35 డీల్కు భారత్ బ్రేక్స్..?
రాయలసీమలో 90 శాతం ప్రాజెక్టులు మన హయాంలో చేపట్టినవే. మనం చేపట్టిన ప్రాజెక్టులను గత ప్రభుత్వం నిలిపివేసింది.. పథకాలను రద్దు చేసిందని మండిపడ్డారు చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కింద ఏడాదికి రూ.12,500 ఇస్తామని రూ.7,500 మాత్రమే ఇచ్చింది. రైతులకు రూ.1,674 కోట్లు బకాయిలు పెడితే మన ప్రభుత్వం వచ్చాక చెల్లించాం. 90 శాతం సబ్సీడీతో డ్రిప్ ఇస్తున్నాం. అగ్రిటెక్ ద్వారా రైతులకు పరికరాలు అందజేస్తున్నామని వెల్లడించారు… ప్రాజెక్టులన్నీ నీళ్లతో కళకళలాడుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు జూలై నెలలోనే 2 సార్లు నిండింది. హంద్రీనీవా ఫేజ్-1లో భాగంగా నీళ్లు విడుదల చేశాం. ఏడాదిలో రూ.3,890 కోట్లు ఖర్చు చేసి హంద్రీనీవా పనులు పూర్తి చేస్తున్నాం. ఇవన్నీ రైతులకు మేలు చేకూర్చేవే అన్నారు.. ప్రతి రైతులో మన ప్రభుత్వం ఉందనే భరోసాను కలిగించాలి. ఇప్పటికే ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహిస్తున్నాం. ఏమైనా లోపాలుంటే సరి చేసుకోవాలని సూచనలు ఇస్తున్నాం అన్నారు.. అయితే, రాష్ట్రంపై ఇంకా కొందరు కుట్రలు పన్నుతూనే ఉన్నారు.. అలాంటి వాళ్ల నైజాన్ని ప్రజల్లో ఎండగట్టాలని పిలుపునిచ్చారు చంద్రబాబు.. పార్టీకి పని చేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుంది. సుపరిపాలనలో తొలి అడుగు కాక్యక్రమంలో భాగంగా కోటి కుటుంబాలను కలిశారని ఈ సందర్భంగా వెల్లడించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.