CM Chandrababu Reviews Iran War Impact: ఇరాన్ యుద్ధ ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగిన నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గల్ఫ్ దేశాలతో ఉన్న అన్ని అంశాలూ ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని వాటి వల్ల సంక్షోభం తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో వివిధ అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎల్పీజీ, గుడ్లు, అరటి వంటి వాటి ఎలాంటి ప్రభావం ఉందోననే అంశంపై నిరంతరం పరిశీలించాలని సీఎం సూచించారు. యుద్ధ ప్రభావిత దేశాలతో పాటు ఇతర ప్రాంతాల్లో తెలుగు వారు ఉన్న చోట పరిస్థితిని ఎప్పటికప్పుడు గుర్తించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. విదేశాంగ వ్యవహారాల శాఖతో సంప్రదించి ప్రవాసాంధ్రుల క్షేమంగా ఉండేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి రియల్ టైమ్ గవర్నెన్సు కేంద్రంతో పాటు ఉన్నతాధికారులు ఓ బృందంగా ఏర్పడి ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయాలని సూచించారు.
Read Also: Boost Iron Levels in Summer: సమ్మర్లో ఐరెన్ స్థాయి పెంచే 7 సూపర్ ఫుడ్స్ మీకోసం..
అంతకుముందు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థలు అందిస్తున్న పౌర సేవలు, విద్యుత్ సరఫరా, పాఠశాల, ఉన్నత విద్య, ఇసుక సరఫరా లాంటి అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్షించారు. ప్రస్తుత ఏడాదిలో విద్యుత్ వినియోగం గరిష్టంగా 14,013 మెగావాట్లకు చేరుకుందని అధికారులు వివరించారు. విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఎనర్జీ ఆడిట్ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి డిస్కంలను ఆదేశించారు. ఈ విషయంలో వినియోగదారులకు పూర్తి సమాచారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని డిస్కంలకు సూచించారు. అటు పాఠశాల, కళాశాల విద్యకు సంబంధించిన అంశాల్లో సిలబస్, మధ్యాహ్న భోజనం, పరిశుభ్రమైన తరగతి గదులు వంటి అంశాలపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తృణ ధాన్యాలతో చిక్కీ లాంటి పౌష్టికాహారం అందించే అంశాన్ని ప్రయోగాత్మకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.