CM Chandrababu Serious: మంత్రులపై మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో అజెండా అంశాలపై చర్చ జరిగిన తర్వాత.. మంత్రులతో ఇతర అంశాలపై మాట్లాడిన ఆయన.. మంత్రుల పనితీరు, విధులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “మీకు ఎన్నిసార్లు చెప్పినా లెక్కలేదా,” అంటూ మంత్రులు తమ బాధ్యతలను గౌరవించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, ప్రస్తుతం అమరావతిలో మంత్రులు, ఎమ్మెల్యేల కోసం నివాస భవన సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఎమ్మెల్యే కోసం ఎత్తైన టవర్స్, మంత్రుల కోసం ప్రత్యేకంగా బంగ్లాలు నిర్మిస్తున్నారు. గతంలో సీఎం చంద్రబాబు అన్ని మంత్రులకు నిర్మాణాలను పరిశీలించాలని సూచించగా, ఇప్పటివరకు చాలామంది మంత్రులు ఈ పనిని చేపట్టలేదని అధికారులు వెల్లడించారు. సమస్త నిర్మాణాలు సమర్థవంతంగా, గడువులో పూర్తి కావాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు.. కానీ, మంత్రుల నుంచి సరైన స్పందన లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.. మంత్రుల నిర్లక్ష్యంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేయడంతో.. మంత్రులు ఇప్పుడు ఆ వైపుగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.