Chandrababu On Urea: ఏపీ సచివాలయంలో కొనసాగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్లో వ్యవసాయంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. యూరియా వాడితే అధిక దిగుబడి వస్తుందనడం కరెక్ట్ కాదు అన్నారు. దీనికి పంజాబ్ను కేసు స్టడీగా తీసుకోవాలి అని సూచించారు. యూరియాను అవసరం మేరకే వాడాలని తెలిపారు. అయితే, రైతులు వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకాన్ని తగ్గిస్తే, ఆ మేరకు ప్రోత్సాహం ఇస్తామని చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం వాడుతున్న యూరియాను తగ్గించే ప్రతి కట్టకు రూ. 800 నేరుగా రైతులకు అందజేస్తామని వెల్లడించారు. మన రైతులు ఎక్కువ ఎరువులు వాడుతున్నారు, దాని వల్ల మిరప పంటను చైనా తిప్పి పంపించిందన్నారు. అలాగే, కొన్ని యూరప్ దేశాలు కూడా మన ఉత్పత్తులపై ధరలను తగ్గిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలియజేశారు.
Read Also: Mirai : మిరాయ్ మూడు రోజుల కలెక్షన్స్.. సూపర్ సెన్షేషన్
అయితే, ప్రజారోగ్యం దృష్ట్యా పంటల్లో యూరియా వినియోగం తగ్గిస్తే మంచిదని చంద్రబాబు అన్నారు. యూరియా వినియోగం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. ఇప్పటికే, ఏపీ క్యాన్సర్లో టాప్ 5 స్థానంలో ఉంది.. ఇలాగే, కొనసాగితే క్యాన్సర్లో ప్రథమస్థానంలోకి వెళ్తామన్నారు. త్వరలోనే దానికి సంబంధించిన విధి విధానాలను ప్రకటిస్తామన్నారు. పీఎం ప్రణామ్ కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే సబ్సిడీని రైతులకే ఇచ్చేద్దాం.. ఇక, యూరియా కొరత లేదు.. అవసరమైతే డోర్ డెలివరీ చేద్దామన్నారు. నియోజకవర్గానికో యానిమల్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలని సూచించారు. అర్బన్ నియోజకవర్గాలను మినహాయించి 157 నియోజకవర్గాల్లో యానిమల్ హాస్టళ్ల నిర్మాణం చేపట్టాలి అన్నారు. అలాగే, గోశాలల నిర్మాణం వల్ల పశు సంపద రాష్ట్రానికి రిటన్ గిఫ్ట్ ఇస్తోంది.. జీఎస్డీపీ వృద్ధిలో లైవ్ స్టాక్ పాత్ర కీలకం కానుంది. పాడి పరిశ్రమ అనేది చక్కటి ఆదాయ మార్గంగా ఉంటుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.