Home Minister Anitha: మహిళల రక్షణ విషయంలో పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలని ఏపీ హోంమంత్రి అనిత ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహిళల రక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం స్పష్టమైన వైఖరి కలిగి ఉందని.. విద్య, సాధికారత, భద్రత విషయంలో రాజీ ఉండదన్నారు. మహిళల రక్షణ కోసం హెల్ప్ డెస్కుల ఏర్పాటు, అవసరమైన సిబ్బంది ఏర్పాటుపై చర్చించారు. ‘సురక్ష’ పేరుతో ప్రత్యేక యాప్ రూపకల్పనపై కీలక సూచనలు చేశారు.. ఏదేమైనా మహిళల రక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పదద్దని స్పష్టం చేశారు..
Read Also: Madhu Yaskhi Goud : అవినీతి అధికారుల లిస్ట్ ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు చేరింది
మహిళల రక్షణ కోసం స్పెషల్ వింగ్ ఏర్పాటు చేసి.. అవసరమైన సిబ్బంది ఏర్పాటు, వారికి ట్రైనింగ్ ఇవ్వాలని ఆదేశించారు ఏపీ హోం మంత్రి. యాప్ రూపకల్పన మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.. మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. పోక్సో కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా ఛార్జిషీట్లు పకడ్బందీగా తయారు చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో సురక్ష టీమ్ లు పెట్టి 24 గంటలు నిఘా ఉంచాలని ఆదేశించారు. 112, 181, 1098 వంటి హెల్ప్ లైన్లపై ప్రజల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని.. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో ప్రజలకు దగ్గరై.. నేరాలు తగ్గించాలని సూచించారు.. రాష్ట్రవ్యాప్తంగా నేరాలు జరిగే ఆస్కారమున్న ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు, నిఘా పెంపు వంటి చర్యలు చేపట్టాలని.. అదే సమయంలో టెక్నాలజీని ఉపయోగించుకొని డ్రోన్ల వినియోగం కూడా పెంచాలన్నారు. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో మహిళలను దూషిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. దానిపై యువతలో అవగాహన పెంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మహిళల రక్షణ కోసం పోలీస్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి 24 గంటలు డీఎస్పీ స్థాయి అధికారులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత..