AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి అభివృద్ధి, కీలక విధాన నిర్ణయాలపై ఫోకస్‌..

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రేపు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనుంది. ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, పలు విధానపరమైన నిర్ణయాలు, భూ కేటాయింపులు తదితర కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అమరావతిలో హైకోర్టు భవనాల పరిసరాల్లో రూ.547 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయాల కల్పనకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అలాగే ఏపీసీఆర్డీఏ బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటు ప్రతిపాదనకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

రాజధాని ప్రాంత అభివృద్ధిలో భాగంగా తొమ్మిది జిల్లాల పరిధిలో అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు సంబంధించిన ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) ప్రక్రియకు ఆమోదం లభించే అవకాశం ఉంది. సీఆర్డీఏకు సొంత అగ్నిమాపక విభాగాన్ని ఏర్పాటు చేయడంపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో పీపీపీ విధానంలో డిజైన్-బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ మోడల్ ద్వారా అమరావతిలో జెయింట్ అబ్జర్వేషన్ వీల్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ ప్రాజెక్టు రాజధాని ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

×
×
Ad

ఎల్పీఎస్ లేఅవుట్లలో వీధిపోట్లు ఉన్న ప్రాంతాల్లో ఏటీఎంలు, కియోస్క్‌లు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వడం, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను పీపీపీ లేదా జాయింట్ వెంచర్ విధానంలో ఏర్పాటు చేయడం వంటి అంశాలు కూడా సమావేశంలో చర్చకు రానున్నాయి. నెగోషియబుల్ సెటిల్మెంట్ పాలసీ కింద అనువుగా లేని ప్లాట్లకు గ్రామకంఠంలో ఐదు సెంట్ల వరకు భూమి కేటాయింపునకు ఆమోదం తెలిపే అవకాశముంది. అలాగే రాజధాని ప్రాంతంలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటుకు సంబంధించిన టాబ్రీడ్ ఒప్పందాన్ని రద్దు చేసి, కొత్తగా టెండర్లు పిలిచే అంశంపై కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.

ఎల్పీఎస్ లేఅవుట్లలో 495 మంది రైతుల అలాట్‌మెంట్ కోడ్‌లు మారిన నేపథ్యంలో వారికి రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు కల్పించే ప్రతిపాదనపై కూడా చర్చించి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల అంశం కూడా మంత్రివర్గ సమావేశంలో ప్రాధాన్యం పొందనుంది. సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ‘తల్లికి వందనం’ పథకానికి నిధుల విడుదలపై కూడా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ పథకం అమలుకు అవసరమైన ఆర్థిక వనరులపై మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రాజకీయ పరంగా కూడా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై మంత్రులతో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. అలాగే రెండేళ్ల కూటమి పాలనలో చేపట్టిన కార్యక్రమాలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై కూడా సమీక్ష నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.