మద్యం సేవించి వాహనాలు నడిపడంతో ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలలో అమాయకులు ప్రాణాలు విడుస్తున్నారు. ముమ్మాటికీ మద్యం సేవించి వాహనం నడపడం తప్పేనని కోర్టులు, పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తునప్పటికీ కొందురు మందుబాబులు మాత్రం మారడం లేదు. అయితే.. ఏపీలో ఓ వ్యక్తి దాదాపు పూటుగా తాగి బైక్ డ్రైవింగ్ చేస్తూ వచ్చి పోలీసులుకు పట్టుబడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనమలూరు సీఐ గోవిందరాజు కథనం ప్రకారం.. గుడివాడ సమీపంలోని వెంట్రప్రగడకు చెందిన ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో పీకల వరకు మద్యం తాగి బైక్పై షికారుకు బయలుదేరాడు.
ఆపై బందరు రోడ్డుపై కాసేపు హడావిడి చేసి పోలీసులకు చిక్కాడు. పూర్తి మద్యం మత్తులో ఉన్న అతడికి బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించిన సీఐ.. రీడింగ్ పర్సంటేజీ చూసి షాక్కు గురయ్యారు. అందులో ఏకంగా 530 పాయింట్లు చూపించడంతో వాపోయారు. 15కుపైగా బీర్లు తాగితే తప్ప అంత రీడింగ్ రాదని, అతడి వాహనాన్ని సీజ్ చేసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు సీఐ వెల్లడించారు. అతడు తమకు చిక్కడంతో ప్రాణాలతో బతికి బయటపడ్డాడని, వేరే మార్గంలో వెళ్లి ఉంటే ప్రమాదం జరిగి తన ప్రాణాలతో పాటు ఇతరుకు కూడా హానికలిగుండేదన్నారు.