రెండేళ్లుగా కరోనా నుంచి బారినపడకుండా తనను తాను రక్షించుకున్న ఉత్తర కొరియాలో ప్రస్తుతం మహమ్మారి తన విశ్వరూపం చూపిస్తోంది. గురువారం రాజధాని ప్యోంగాంగ్లో తొలి కేసు వెలుగు చూసింది. అప్పటి వనుంచి మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు 42 మంది కరోనా బారిన పడి చనిపోయారు. ఆదివారం ఉత్తర కొరియా అధికార మీడియీ కరోనా వ్యాప్తికి సంబంధించి అనేక విషయాలు వెల్లడించింది.
మరోవైపు, ఒమిక్రాన్ కేసుల సంఖ్య ఆందోళన కలిగించే స్థాయిలో వేగంగా విస్తరిస్తోంది. కేవలం మూడు రోజులలో దేశంలో బాధితుల సంఖ్య 8,20,620కు చేరింది. రాజధాని ప్యోంగ్యాంగ్ నుంచే అధికంగా రోజు వారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. పాజిటివ్గా నిర్థారణ అయిన వారిలో 3,24,550 మంది ప్రస్తుతం వైద్య చికిత్సం పొందుతున్నారు.
కరోనా మహమ్మారి వ్యాప్తిని ఉత్తర కొరియా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. దేశ చరిత్రలో ఘోరమైన విపత్తుగా పరిగణించి కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ విపత్కర సమయంలో ప్రభుత్వం, ప్రజలు కలిసి కరోనాతో పోరాడలని అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పిలుపునిచ్చారు. గతంలో ఎప్పుడూ మాస్క్తో కనిపించని ఆయన ఇప్పుడు మాస్క్ ధరించి దర్శనమివ్వటం కరోనా తీవ్రతను తెలియజేస్తోంది.
అత్యంత అధ్వాన్నమైన ప్రజారోగ్యవ వ్యవస్థలను కలిగిన దేశాలలో ఉత్తర కొరియా ఒకటి. పశ్చిమ దేశాల ఆంక్షల నేపథ్యంలో దేశం తీవ్ర పేదరికాన్ని అనుభవిస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్లు, యాంటీవైరల్ ట్రీట్మెంట్ డ్రగ్స్ , మాస్-టెస్టింగ్ సదుపాయాలు వంటి అందుబాటులో లేవు. వ్యాక్సిన్ సాయానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముందుకు వచ్చినా ఉత్తర కొరియా ప్రభుత్వం నిరాకరించింది. దాంతో రెండున్నర కోట్ల ప్రజలు కరోనా టీకాకు దూరంగా ఉన్నారు.
కరోనా పట్ల ఉత్తర కొరియా ప్రభుత్వం ఆది నుంచీ అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. ఐతే, పొరుగున ఉన్న చైనాలో ఇటీవల ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించింది. అక్కడి నుంచే ఉత్తర కొరియాకు మహమ్మారి దిగుమతి అయిందని బావిస్తున్నారు.
టీకా అందుబాటులో లేకపోవటంతో ప్రస్తుతం ఒమిక్రాన్ నియంత్రణకు కఠిన లాక్డౌన్ మినహా మరో మార్గం లేదు. ఇప్పటి వరకు మనం చూసిన వేరియంట్లతో పోల్చితే ఒమిక్రాన్ పది రెట్లు వేగంగా వ్యాపిస్తుంది. అందుకే, ఎన్ని కఠన చర్యలు అమలు చేసినా రోజు వారీ కేసుల సంఖ్య భారీగా ఉంటోంది.
దేశంలోని అన్ని ప్రావిన్సులు, నగరాలు, కౌంటీలు పూర్తిగా లాక్ డౌన్లోకి వెళ్లిపోయాయి.
ఉత్తర కొరియా జీడీపీలో ఇరవై శాతాన్ని మిలటరీ మీద ఖర్చు చేస్తున్నారు. కానీ, ప్రజారోగ్యంపై ఖర్చు చేసేది అంతంత మాత్రమే. 2019లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం 43 శాత మంది ఉత్తర కొరియా ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. గత పాతికేళ్లలో క్షయ రోగుల సంఖ్య పెరుగుతూ పోతోంది. 2016 లెక్కల ప్రకారం ప్రతి లక్ష మందికి 640 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. ఐతే, ఉత్తరకొరియా దీన స్థితిని చూసి లాభాపేక్ష లేని కొన్ని అంతర్జాతీయ సంస్థలు ఆ దేశ ఆరోగ్య సంరక్షణ మెరుగుకు సాయం అందిస్తున్నాయి.
2010లో ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉత్తర కొరియాలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై పరిశోధన నిర్వహించింది. ఒక వ్యక్తిపై ఏడాదికి ఒక్క డాలర్ కూడా ఖర్చు చేయటం లేదు. ప్రపంచంలోని అన్ని దేశాల కన్నా ఇది తక్కువ. ఉత్తర కొరియా అనుసరించే రాజకీయ విధానలతో సంబంధం లేకుండా మానవతా దృక్ఫతంతో సహాయం చేయాలని అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రపంచ దేశాలను కోరుతోంది.
కోవిడ్ విషయంలో గత రెండున్నర ఏళ్లుగా బయటి నుంచి సాయం పొందటాన్ని కిమ్ ప్రభుత్వం తిరస్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిన పొట్టన పెట్టుకోవటం చూసి కూడా టీకా పట్ల విముఖత ప్రదర్శించాడు. తమ సోషలిస్టు విధానాలతో కరోనా దేజంలో అడుగు పెట్టకుండా చేస్తామని ప్రగల్బాలు పలికాడు. కానీ, కరోనాకు అంతా సమానమే.. సోషలిజం ..క్యాపిటలిజం అనే తేడా లేదు. ఏ మాత్రం ఏమరపాటుతో ఉన్నా తన ప్రతాపం చూపిస్తుంది. ఇప్పుడు ఉత్తర కొరియాకు దాని తాజా బాధితురాలిగా మారింది.
కరోనా దేశంలో ప్రవేశించకుండా రెండేళ్లకుపైగా దేశ సరిహద్దులు మూసివేసింది. అయినా ఈ స్థాయిలో వైరస్ ఎలా విజృంభిస్తోందో తెలియదు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 25న మిలటరీ ఫౌండేషన్ డే సందర్భంగా నిర్వహించిన భారీ పరేడ్ దీనికి కారణం కావచ్చని భావిస్తున్నారు. మాస్కులు, భౌతికదూరం వంటి సాధారణ కోవిడ్ నిబంధనలేవీ పాటించకుండా వేలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏప్రిల్ 25 తరువాతే పెద్ద ఎత్తున జనంలో కొవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. దేశంలో కరోనా విజృంభణకు సైనిక పరేడ్తో సంబంధం ఉండవచ్చని పొరుగున ఉన్న దక్షిణ కొరియా పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
గతంలో జరిగిన సైనిక ప్రదర్శనలలో పాల్గొన్న వారు మాస్కులు ధిరించారు. చిన్న నిర్లక్ష్యమే ఈ సారి కొంప ముంచింది. కొన్ని రోజులుగా పెద్ద ఎత్తునప్రజలు తీవ్ర జ్వరంతో అనారోగ్యం పాలయ్యారు. కానీ కిమ్ ప్రభుత్వం దానిని బయటకు వెల్లడించలేదు. పరిస్థితి చేయిదాటిపోవటంతో ఇప్పుడు ప్రపంచానికి వెల్లడించారు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర కొరియాలో పెద్ద ఎత్తున మానవతా సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ఇది ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. అంతంత మాత్రపు ఆరోగ్య వ్యవస్థ, కడు పేదరికంలో మగ్గుతున్న ఉత్తర కొరియాలో మహమ్మారి ఉద్ధృతి ఇలాగే కొనసాగితే పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఈ పరిస్థితులో అంతర్జాతీయ సాయం లేకుంటే పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించవచ్చు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చెపుతున్న దాని ప్రకారం.. ఇప్పటి వరకు ఉత్తర కొరియాలో కేవలం 64,200 కొవిడ్ పరీక్షలు మాత్రమే నిర్వహించారు.
ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాలు అమెరికా, చైనా, జర్మనీ, బ్రిటన్ వంటి అనేక దేశాలను అల్లల్లాడించిన కోవిడ్ -19 మహమ్మారి కోరల నుంచి ఉత్తర కొరియా ఎలా బయటపడుతుందో ఏమో!!