భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్రం సెంటర్ విస్టా భవనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. సెంటర్ విస్టా ప్రాజెక్టులో కొత్త పార్లమెంట్ భవనం, సెక్రటేరియట్, ఉప రాష్ట్రపతి, ప్రధాని కొత్త నివాసాలను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు మొత్తం 2026 వరకు పూర్తి కానున్నది. కొత్త పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా అవెన్యూ కోసం కేంద్రం రూ. వెయ్యి కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించింది. 75 వ స్వాతంత్ర తరువాత జరిగే పార్లమెంట్ సమావేశాలను కొత్త భవనంలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, సెంట్రల్ విస్టా భవనాల నిర్మాణాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. కరోనా కాలంలో ఆ నిధులను వ్యాక్సిన్ కోసం వినియోగించాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ, కేంద్రం ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదు, వ్యాక్సిన్ కొనుగోలు కోసం పెద్ద ఎత్తున ఇప్పటికే నిధులు కేటాయించామని, వ్యాక్సిన్ కు, దీనికి సంబంధం లేదని కేంద్రం చెప్తున్నది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ ప్రాజెక్టు కోసం 400 మంది పనులు నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాది వరకు పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా అవెన్యూ నిర్మాణం పూర్తి చేయనున్నారు.