నిన్న తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఉద్యోగుల బదిలీల అంశంపై కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు నిన్న రాత్రి బండి సంజయ్ జాగరణ దీక్ష భగ్నం చేసేందుకు రాగా బండి సంజయ్ను కార్యకర్తలు కార్యాలయంలోకి పంపి తాళం వేశారు. దీంతో పోలీసులు రాత్రి 10 గంటల సమయంలో తలుపులు బద్దలు కొట్టి నాటకీయ పరిణామాల మధ్య బండి సంజయ్ను అరెస్ట్ చేశారు.
అయితే ఈ రోజు కరీంనగర్ ఎక్సైజ్ కోర్టులో బండి సంజయ్ను హజరుపరిచారు పోలీసులు. ఈ క్రమంలో బండి సంజయ్కు 14 రోజులు రిమాండ్ను కరీంనగర్ ఎక్సైజ్ కోర్టు విధించింది. ఈ సందర్భంగా బండి సంజయ్ తరుపు న్యాయవాది మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు గాయపడ్డారు ఎవరు గాయపర్చింది డిటైల్స్ సరిగా లేవని, 353 కాకుండా 333 కింద నోటిస్ ఇవ్వకుండా కోర్టుకు తీసుకువచ్చారని ఆయన అన్నారు.
కావాలనే సెషన్స్ కోర్టు కాకుండా ఎక్సైజ్ కోర్టుకు తీసుకు వచ్చారని, లోపల ఉన్నోళ్లు బయట ఉన్నోళ్లను ఎలా కొడతారని ఆయన అన్నారు. బండి ఎవరిని కొట్టారో ఎటువంటి రుజువు లేదని, మేము కోర్టులో కేసును రిజక్ట్ చేయాలని కోరామన్నారు. జైలులో విష ప్రయోగం జరిగే అవకాశం ఉందని తెలపడం జరిగిందని ఆయన వెల్లడించారు. పోలీసులు కావాలని నోటీసులు ఇవ్వకుండా కేసు పెట్టారని, ఇది ప్రభుత్వం దుర్మార్గపు చర్య అని ఆయన ఆరోపించారు. రేపు హైకోర్టులో మరోసారి బెయిల్ పిటిషన్ వేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఒక వ్యక్తి మీద ఓకే సమయంలో నేరం ఉంటే ఓకే కేసు పెట్టాల్సి ఉంది కాని ఇక్కడ రెండు కేసులు పెట్టడం జరిగిందని ఆయన తెలిపారు.