ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మొదటి దశలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పారు. నూతన జోనల్ విధానానికి అడ్డంకులు తొలగడంతో ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఇక ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను గుర్తించి రెండో దశలో భర్తీ చేయాలని సూచించారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను సిద్ధం చేసి కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని చెప్పారు. రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇటీవలే రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించిన నేపథ్యంలో.. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల భర్తీ అంశంపై ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
also read సర్కార్ కీలక నిర్ణయం.. ఏడాది పాటు భూముల మార్కెట్ ధర మారదు..
గత పాలనలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అస్తవ్యస్తంగా ఉండేది.. స్థానికులకు న్యాయం జరగాలనే ఉద్యమ నినాదాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నూతన జోనల్ వ్యవస్థను ప్రవేశపెట్టిందని అని తెలిపారు సీఎం కేసీఆర్.. ఎంతో శ్రమతో అత్యంత శాస్త్రీయ విధానాన్ని అనుసరించి రూపొందించిన జోనల్ వ్యవస్థకు కేంద్రం అమోదం లభించడంలో ఇన్నాళ్లు జాప్యం జరిగింది. ఇటీవలే రాష్ట్రపతి ఆమోదం లభించడంతో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అన్నిరకాల అడ్డంకులు తొలగిపోయాయి. నేరుగా నింపే అవకాశాలున్న (డైరెక్టు రిక్రూట్ మెంట్) అన్ని రకాల ఉద్యోగాలు దాదాపు 50 వేల దాకా ఖాళీగా ఉన్నాయి. వాటిని ముందుగా భర్తీ చేస్తాం. ఇప్పటికే అన్నిశాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ప్రమోషన్లు చేపట్టడం ద్వారా ఏర్పడిన ఉద్యోగ ఖాళీలను కూడా గుర్తించి భర్తీ చేయాలి. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన నివేదికను సిద్దం చేసి కేబినెట్ సమావేశానికి తీసుకురండి అంటూ సంబంధిత అధికారులను ఆదేశించారు.. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, సిఎం కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ఇక, ఎంతో కాలంగా ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తోన్న నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పినట్టు అయ్యింది.