కరోనా కారణంగా ఏడాదిన్నరగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆ మధ్యలో తెరుచుకున్నా వైరస్ మళ్లీ విజృంభించడంతో మరొసారి విద్యా సంస్థలను మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలు తెరిచేందుకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఏపీలో స్కూళ్లు పునప్రారంభం కానున్నాయి. ప్రత్యక్ష తరగతులు జరగనున్నాయి.కరోనా కష్టాలు, సవాళ్లు అన్నింటినీ అధిగమించి.. పాఠశాలల ప్రారంభానికి రెడీ అయింది ప్రభుత్వం. థర్డ్ వేవ్ హెచ్చరికలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ అధికారులు.. తరగతుల నిర్వహణపై పలు సూచనలు, మార్గదర్శకాలను విడుదల చేసింది.
తరగతి గదికి 20 మంది విద్యార్థులకు మించకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. స్థానిక పరిస్థితుల ఆధారంగా ప్రతి స్కూల్కి ఎస్వోపీ ఉండాలని తెలిపింది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా రోజు విడిచి రోజు తరగతులను నిర్వహించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రుల్లో కొంత ఆందోళన కనిపిస్తోంది. కొందరు పేరెంట్స్ తమ పిల్లలను పాఠశాలలకు పంపేందుకు వెనుకంజ వేస్తున్నా.. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా స్కూళ్లు తెరవడం అనివార్యం అంటున్నారు మరికొందరు తల్లిదండ్రులు.