భారతదేశంలోని మహిళలు చీరకట్టు అంటే ఎంతో ఇష్టం. అది మన సంప్రదాయానికి సూచిక కూడా. అయితే కేరళలో చీరకట్టు అంశం వివాదం రేపుతోంది. ఆ రాష్ట్రంలో మహిళా టీచర్లు తప్పనిసరిగా ప్రతి రోజు చీర ధరించాల్సిందే అంటూ విద్యాసంస్థల యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయని పలువురు టీచర్లు కేరళ విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విద్యాశాఖ మంత్రి ఆర్ బిందు స్పందించారు. టీచర్లు తప్పనిసరిగా చీరలు ధరించాలనే పద్ధతి సరికాదని పేర్కొన్నారు. మహిళలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఆడవారి వ్యక్తిగత అభిప్రాయమని.. ఇందులో ఎవరి జోక్యం అవసరం లేదని విద్యాసంస్థల యాజమాన్యాలపై మంత్రి బిందు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: మన తిరుమలకు అరుదైన గుర్తింపు
ఒక టీచర్కు అనేక బాధ్యతలు ఉంటాయని… అయితే ఇటువంటి పాత, వాడుకలో లేని ఆలోచనలకు కట్టుబడి ఉండటం ఆ బాధ్యతలలో ఒకటి కాదని మంత్రి బిందు వ్యాఖ్యానించారు. మరొకరి దుస్తుల ఎంపికను విమర్శించే, జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని బిందు స్పష్టం చేశారు. తాను మంత్రిని మాత్రమే కాక ఓ కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నానని.. తాను కాలేజీకి చుడీదార్లు వేసుకువెళ్తున్నానని తెలిపారు. ఈ మేరకు మహిళా టీచర్లు చీర ధరించడం తప్పనిసరి కాదని ప్రభుత్వం ఓ సర్క్యులర్ జారీ చేసింది.
