ఏపీలో వన్ టైం సెటిల్మెంట్ పథకంపై ప్రతిపక్ష విమర్శల నేపథ్యంలో అవగాహన కార్యక్రమాల పై ఫోకస్ చేసింది వైసీపీ. వన్ టైం సెటిల్మెంట్ పథకం పై పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సజ్జల ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ సమావేశానికి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాధరాజు, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి హాజరయ్యారు.
పేదలకు లబ్ది జరక్కుండా అపోహలు కల్గించి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని విపక్షాలు, కొన్ని మీడియా సంస్థలపై సజ్జల విరుచుకుపడ్డారు. ఓటిఎస్ పధకంపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా గృహాల లబ్దిదారులకు పదివేల కోట్ల రూపాయల మేలు జరుగుతుంది. రిజిస్ర్టేషన్ ఛార్జీల మినహాయింపు దొరుకుతుందన్నారు.
పేదవారికి మేలు చేకూర్చేందుకే జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం అమలుచేస్తున్నామన్నారు. సొంతంగా రిజిస్ర్టేషన్ చేయించుకోవాలంటే ప్రాంతాన్ని బట్టి 35 నుంచి 50 వేల రూపాయల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. పథకం పట్ల ప్రజలలో అపోహలు తొలగించాలి. ప్రతి ఇంటిని సందర్శించి వారికి కలిగే ప్రయోజనాన్ని వివరించాలని సజ్జల కోరారు.