రాష్ట్ర భవిష్యత్తును ఆకాంక్షించే వారు అమరావతినే రాజధానిగా అంగీకరిస్తారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిపై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. కరుడు గట్టిన తీవ్రవాది కూడా అమరావతికే ఆమోదం తెలుపుతారని పేర్కొన్నారు. రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలని అందరూ చెబుతున్నారని.. అమరావతి చరిత్ర సృష్టించే నగరం అని చంద్రబాబు తెలిపారు. విభజన తర్వాత ఏపీకి రాజధాని లేదన్నారాయన. హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంటే.. టీడీపీ హయాంలో సైబరాబాద్ నగరం సృష్టించామని చెప్పారు. వాస్తు ప్రకారం సైబరాబాద్ నగర నిర్మాణం సరికాదని అంతా చెప్పారని.. భూమి అక్కడే అందుబాటులో ఉందని సైబరాబాద్ నగర నిర్మాణంపై ముందుకెళ్లామని అన్నారు. కనీసం సైబరాబాద్కు అప్పట్లో నీటి సదుపాయం కూడా లేని పరిస్థితి.. కృష్ణా నది నుంచి పైప్ లైన్ వేసి సైబరాబాద్కు తెచ్చామని పేర్కొన్నారు. కృష్ణా జలాలను హైదరాబాద్కు తెచ్చిన ఘనత టీడీపీదేనని సీఎం చంద్రబాబు చెప్పారు.
Koo App Shutdown : మూతపడ్డ దేశీయ సోషల్ మీడియా ‘ కూ ‘ యాప్..
ప్రపంచంలో పెద్ద ఎత్తున భూ సమీకరణ చేపట్టిన ప్రాజెక్టు అమరావతేనని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతి భూ సమీకరణ విధానాన్ని ప్రపంచ బ్యాంక్ కేస్ స్టడీగా తీసుకుందని.. అమరావతికి భూములిచ్చిన రైతులతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం.. చట్టాలు రూపొందించామన్నారు. పదేళ్ల పాటు అమరావతి రైతులకు కౌలు ఇచ్చాం.. అలాగే అమరావతికి భూములిచ్చిన రైతులకు కమర్షియల్, రెసిడెన్షియల్ ఏరియాల్లో రిటర్నబుల్ ప్లాట్లు కూడా ఇచ్చామన్నారు ముఖ్యమంత్రి. అమరావతి రైతులకే కాదు.. రైతు కూలీలకు కూడా పెన్షన్లు ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. స్వయం సమృద్ధి సాధించేలా.. ఆదాయం పెరిగేలా అమరావతి రాజధానిని రూపొందించామన్నారు. రాష్ట్రం నడిబొడ్డునే రాజధాని ఉండాలని నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చెప్పాడని.. నాటి టీడీపీ ప్రభుత్వం రాజధాని కోసం ఏం చేస్తుందో చెబితే.. దానికి జగన్ అంగీకరించారన్నారు. అమరావతిలోనే జగన్ ఇల్లు కట్టుకున్నాడు.. చంద్రబాబుకు ఇల్లు కూడా లేదని తనను విమర్శించాడని తెలిపారు. అధికారంలోకి వచ్చాక.. అమరావతిని జగనేం చేశాడో అందరికీ అర్థమైంది.. సింగపూర్ ప్రభుత్వం సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఉచితంగా రూపొందించి ఇచ్చిందన్నారు. మాస్టర్ ప్లాన్లో మొత్తంగా తొమ్మిది నగరాలు ఉన్నాయని చంద్రబాబు చెప్పారు.
Supritha: సాంప్రదాయనీ… ‘సుప్పి’నీ.. ఏంటిదీ?
జగన్ అధికారంలోకి రాగానే ప్రజా వేదిక కూల్చేశారు.. మూడు రాజధానులన్నారు.. బీసీజీ రిపోర్ట్ అన్నారు.. జీఎన్ రావు కమిటీ అన్నారు.. విధ్వంసానికి ఎన్ని చేయాలో.. జగన్ అన్నీ చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ప్రజా వేదిక శిథిలాలను అలాగే ఉంచాలని సూచనలు వస్తున్నాయి.. 1631 రోజుల పాటు అమరావతి కోసం రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారని ఆయన తెలిపారు. రాష్ట్రం కోసం భూములిచ్చిన రైతులను జగన్ రోడ్డున పడేశారని.. అమరావతి ఉద్యమంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా.. గత ప్రభుత్వం అడ్డుకుందన్నారు. అమరావతి రైతుల త్యాగం ఊరికేపోదు.. రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామన్నా.. జగన్ అక్కర్లేదన్నారు. సింగపూర్ కన్సార్టియంను రద్దు చేసింది గత ప్రభుత్వమేనని చంద్రబాబు చెప్పారు. మరోవైపు.. అమరావతి ప్రాజెక్టు నిర్మాణ అంచనాలు పెరిగాయని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకం వల్ల నష్టం కూడా విపరీతంగా ఉందన్నారు. గంటలో రూ. 2 వేల కోట్లు సమీకరించుకునేలా బాండ్ల అమ్మకాలు జరిగాయని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతికి అద్బుతమైన రేటింగ్ ఉండేది.. కానీ ఇప్పుడు దారుణంగా దెబ్బతిందని సీఎం ఆరోపించారు. రేటింగ్ తక్కువగా ఉండడం వల్ల పెట్టుబడులు రాలేదు.. రాష్ట్రంలోని పేదలు పాచిపనులకు కూడా పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేసిందని తెలిపారు. వ్యాపారాలు దారుణంగా దెబ్బతిన్నాయి.. పరిశ్రమలు వెళ్లిపోయాయి.. ఉద్యోగులు, ఉపాధి లభించ లేదన్నారు. జీఎస్టీ, ఐటీ వంటి రంగాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గిపోయిందని.. జగన్ ప్రభుత్వ అరాచకం వల్ల రాష్ట్రం ఘోరంగా దెబ్బతిందని తెలిపారు.