1.బీజేపీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కేటీఆర్. జేపీ నడ్డా అంటే పెద్ద మనిషి అనుకున్నాం. బండి సంజయ్ కు …జేపీ నడ్డాకు పెద్ద తేడా లేదు. బీజేపీ అంటే భకవస్ జుమ్లా పార్టీ. యూపీలో బీజేపీ సర్కార్ చేసింది ఏమి లేదు…అంతా చిల్లర రాజకీయం. దేశంలో చిచ్చు పెట్టి నాలుగు ఓట్లు వేయించుకోవాలని బిజెపి ఆలోచనగా వుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో భాగ్యస్వామ్య పక్షాలు ఎవరు అంటే బీజేపీ, ఈడీ,సీబీఐ, ఐటీలే అన్నారు. ఢిల్లీలో కొంత మీడియా మోడీయాగా మారిందని దుయ్యబట్టారు.
2 ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. కొంతమంది నిరసనకారులు రోడ్డును అడ్డుకోవడంతో దాదాపు 20 నిమిషాల పాటు ప్రధాని మోదీ ఫ్లైఓవర్పై ఇరుక్కుపోయారని మంత్రిత్వ శాఖ ప్రకటనలో తెలిపింది. పంజాబ్లో బుధవారం జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీ అనూహ్యంగా రద్దు అయింది. సభకు ప్రధాని మోదీ వెళ్లే మార్గంలో కొంతమంది నిరసనకారులు రోడ్డును దిగ్బంధించారు.
3.టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్లతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో పార్టీ పనితీరు, నియోజకవర్గాల వారీగా క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్లకు ఆయన కీలక సూచనలు చేశారు. ఇన్చార్జ్లు వారి వారి నియోజకవర్గాల్లో పని చేసి తీరాల్సిందేనన్నారు. పనిచేయలేని ఇన్చార్జ్లు ఎవరైనా ఉంటే దండం పెట్టి పక్కకు తప్పుకోండని చెప్పారు.
4 చిరంజీవి, రామ్ చరణ్ తో కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై వస్తున్న ‘ఆచార్య’ సినిమా సమ్మర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన ‘శానా కష్టం…’ పాట యు ట్యూబ్ ని షేక్ చేస్తోంది. మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటను చిరంజీవి, రెజీనాపై చిత్రీకరించారు. ఈ పెప్పీ నెంబర్ మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
5.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్కి ఊరట లభించింది. ఎంపీ బండి సంజయ్ కుమార్ను విడుదల చేయాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. వ్యక్తిగత పూచీకత్తుపై సంజయ్ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. కరీంనగర్ జైలులో వున్న బండి సంజయ్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిగింది.
6.కరోనా మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్నాయి. మంగళవారం రోజున 37 వేలకు పైగా కేసులు నమోదైతే, బుధవారం రోజున 58 వేలకు పైగా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. ఒక్కరోజులో దాదాపు 20 వేలకు పైగా కేసులు పెరిగాయి. అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. నైట్ కర్ఫ్యూలతో పాటుగా కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, సినిమా హాళ్లు వంటి వాటిని మూసివేశారు.
7.ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పుల సంఖ్య మరింత పెరుగుతోంది. తాజాగా మరో రూ.2,500 కోట్ల రుణాన్ని ఏపీ ప్రభుత్వం సమీకరించింది. రిజర్వుబ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని ప్రభుత్వం ఈ రుణాన్ని పొందింది. రాబోయే 20 ఏళ్ల కాలపరిమితితో రుణం తిరిగి చెల్లించేలా 7.22 శాతం వడ్డీతో రూ.వెయ్యి కోట్లు తీసుకుంది. మరో వెయ్యి కోట్లను 18 ఏళ్ల కాలపరిమితికి 7.18 శాతం వడ్డీకి స్వీకరించింది.
8.తెలంగాణలో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి… ఇవాళ మధ్యాహ్నం వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు సంభవించాయి.. సంగారెడ్డి జిల్లాలోని కోహీర్, వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి మండలాల్లో స్వల్పంగా భూమి కంపించినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.. ఇక, ఊహించని ఘటనలో భయాందోళనకు గురైన ప్రజలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు..
9. ప్రపంచమంతా కరోనా కల్లోలం కొనసాగుతోంది. చాలా దేశాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్వెల్ కూడా కరోనా బారిన పడ్డాడు. దీంతో అధికారులు అతడిని ఐసోలేషన్కు తరలించారు. ప్రస్తుతం మ్యాక్స్వెల్ బిగ్బాష్ టోర్నీలో మెల్బోర్న్ స్టార్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
10. టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అడవి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మేజర్. మేజర్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇండియా, జీ.మహేష్ బాబు ఎంటర్ టైన్మెంట్, మరియు a+s మూవీస్ పతాకంపై మహేష్ బాబు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలోని మొదటి పాట రిలీజ్ కి ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్.