యంగ్ టైగర్ ఎన్టీయార్ మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అయిపోయారు. ఓ పక్క ‘ట్రిపుల్ ఆర్’ మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తూనే, మరో పక్క జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వర్లు’ షో షూట్ తో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత వెంటనే ఎన్టీయార్ తో మూవీ ప్రారంభించడానికి కొరటాల శివ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒకసారి బుల్లితెరలో బిగ్ బాస్ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఎన్టీయార్ ఇప్పుడు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’తో మరోసారి బుల్లితెర వీక్షకులను అలరించబోతున్నారు.
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు. యంగ్ టైగర్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ రియాలిటీ షో స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15వ తేదీ ఆదివారం నాడు మొదలు కాబోతోందట. తొలి ఎపిసోడ్ కు రామ్ చరణ్ గెస్ట్ గా వస్తున్నాడని, ఆ ఆటలో అతను గెలిచే మొత్తాన్ని సేవాకార్యక్రమాలకు విరాళంగా ఇస్తారట. ఈ షో ఎన్ని వారాలు కొనసాగుతుందనే విషయంలో క్లారిటీ లేకపోయినా, దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి ఎన్టీయార్ రూ. 10 కోట్లు పారితోషికం తీసుకున్నాడనే గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయి.