నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ గురించి తెలియని వారుండరు. ఇప్పుడున్న కొద్ది మంది కమ్యూనిస్టు నియంతల్లో ఆయన ఒకరు. పూర్తి పేరు కిమ్ జోంగ్ ఉన్. కరడుగట్టిన డిక్టేటర్ గానే కాదు.. తన లైఫ్ స్టయిల్, పాలనా చర్యలతోనూ తరచూ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటాడు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ ఫొటో ఒకటి ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. చక్కగా ట్రిమ్ చేసిన జుట్టు.. లైట్ కలర్ సూట్లో చిన్నారులతో ఉల్లాసంగా కనిపిస్తున్నాడు. చూస్తే డిక్టేటర్ అని ఎవరూ అనుకోరు. రాముడు మంచి బాలుడిలా ఉన్నాడు కిమ్.
ఉత్తర కొరియా 73వ ఫౌండేషన్ డే సందర్భంగా ఉత్తర కొరియా ఇటీవల మిలిటరీ పరేడ్ నిర్వహించింది. ప్రతి ఏటా ఎంతో ఘనంగా ఈ వేడుకలు నిర్వహిస్తుంది. బాలిస్టిక్ క్షిపణులను అట్టహాసంగా ప్రదర్శిస్తుంది. తమ రక్షణ శక్తిని ప్రపంచానికి చూపిస్తుంది. కానీ ఈసారి దానికి కాస్త భిన్నం. పరేడ్లో బాలిస్టిక్ మిస్సైల్స్ లేవు. కానీ సైనికులు గ్యాస్ మాస్క్లు ధరించి పరేడ్ చేయటం ఈ సారి ప్రత్యేకత.
ఈ వేడుకల్లో అందరి చూపు కిమ్ మీదే. ఆయనే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. పరేడ్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు చిన్నారులు గ్రీటింగ్స్ చెప్పారు. వారిని ప్రేమగా పలకరించారు. పిల్లలను ముద్దు కూడా పెట్టుకున్నాడు. ఆహుతల వైపు ఉల్లాసంగా చేతులు ఊపుతూ శుబాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం సాగినంత సేపూ ఆయన పరేడ్లో పాల్గొన్న సైనికులు ఉత్సాహపరచారు. అయితే ఉత్తర కొరియా ప్రజలను ఎక్కువగా ఆకట్టుకున్నది ఆయన అప్పియరెన్స్. ఎప్పుడూ ఊబకాయంతో కనిపించే కిమ్ ఇప్పుడు సన్నగా కనిపించాడు. ముఖం కూడా ప్రసన్నంగా ఉంది. బుగ్గలు లోపలికి వెళ్లాయి. సన్నబడటంతో అతని నడక తీరు కూడా మారింది.
కిమ్ జాంగ్ ఉన్ తన వారసుడి గురించి ఇప్పటి వరకు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు. ఉత్తరకొరియా సర్వాధికారులు ఆయనవే. ఆయన నిర్ణయమే ఫైనల్. అందువల్ల ఆయన ఆరోగ్యానికి దేశంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. కిమ్ బరువు తగ్గించుకోవడంతో తన వయస్సుకు తగ్గట్టు కనిపిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయనను ఇలా చూసిన ఉత్తర కొరియా ప్రజల ఆనందానికి అంతు లేకుండా పోయింది. జూన్లో జరిగిన అధికార పార్టీ సమావేశంలో కిమ్ బరువు తగ్గారని మొదటిసారి తెలిసింది. గతంలో 140 కిలోల బరువుండేవాడు.. ఇప్పుడు 120 కిలోలకు వచ్చాడని అంటున్నారు. చెయిన్ స్మోకరైన కిమ్.. బరువు తగ్గడంతో పాటు పొగతాగడం మానేసినట్లు అప్పట్లోనే వార్తలు వచ్చాయి.
రాత్రి వేళ జరిగిన ఈ పరేడ్ ఫొటోలను మీడియా విడుదల చేసింది.పరేడ్లో పాల్గొన్న ఒక విభాగానికి చెందిన సభ్యులు ఎరుపు రంగు హజ్మత్ సూట్లు, గ్యాస్ మాస్కులు ధరించి కనిపించారు. వీళ్లు కోవిడ్ -19 వ్యాప్తిని అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక సిబ్బంది కావచ్చు. కష్ట సమయంలో దేశ ప్రజల ఆత్మస్థైర్యం పెంచేందుకు ఇలాంటి పరేడ్లను ఉత్తర కొరియా వాడుకుంటూ ఉంటుంది. బల ప్రదర్శనలతో ప్రజల మనోధైర్యాన్ని పెంపొందించడానికి పరేడ్లను ఉపయోగిస్తూ ఉంటుంది. బాణాసంచా కాల్చి ప్రజలను ఉత్సాహపరచి, వారిలో కొత్త ఆశలు పెంపొందించడానికి ఈ కవాతులను వాడుకుంటుంది. గత 12 నెలల వ్యవధిలో ఉత్తర కొరియా మూడు పరేడ్లు నిర్వహించింది.ఉత్తర కొరియా వార్షికోత్సవం సందర్భంగా చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ కిమ్కు శుభాకాంక్షలు తెలిపారు.
కిమ్ జాంగ్ ఉన్ ఎప్పుడో కానీ ప్రజల ముందుకు రాడు. ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే దర్శనమిస్తాడు. ఉత్తరకొరియాకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు అంతగా లేవు. కరోనా వల్ల ఉత్తర కొరియా ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. పొరుగునే ఉన్న చైనాతో వ్యాపారం పూర్తిగా తగ్గిపోయింది. ఆక్కడ వాతావరణ పరిస్థితులు కూడా అంతంత మాత్రమే. తరచూ తుపాన్ల బారిన పడుతుంది. దాంతో అక్కడి వ్యవసాయం అతలాకుతలమవుతుంది. ఇప్పుడు దాదాపు కోటి మందికి పైగా ప్రజలను ఆహార కొరత వేదిస్తోంది. కష్టాల్లో ఉన్న తమను ఈ యువనేత బయటపడేస్తారని ఉత్తర కొరియా ప్రజలు ఎన్నో పెట్టుకున్నారు. అందుకే ఆయన ఆరోగ్యం పట్ల వారికి అంత అతృత. కిమ్ తీరు కూడా ఇప్పుడు కాస్త మారినట్టు కనిపిస్తోంది. ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచటంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అదే జరిగితే ప్రపంచం కూడా హర్షిస్తుంది!