నేటి నుంచి బ్యాంకింగ్, ఆర్థిక రంగ సేవల్లో మార్పులు అమల్లోకి వచ్చాయి. ఏటీఎంల నుంచి నగదు విత్డ్రాకు ఛార్జీలు పెరిగాయి.. అన్ని ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్థిక లావాదేవీపై ఇంటర్ఛేంజ్ ఫీజు 15 నుంచి 17 రూపాయలకు, ఆర్థికేతర లావాదేవీలపై 56 రూపాయలకు పెంచుకునేందుకు బ్యాంకులకు ఆర్బీఐ అనుమతిచ్చింది. ఏటీఎం లావాదేవీలపై 2012 నుంచి ఇంటర్ఛేంజ్ ఫీజులను బ్యాంకులు వసూలు చేస్తున్నాయి. ఒక బ్యాంకుకు చెందిన కస్టమర్ మరో బ్యాంకు ఏటీఎం నుంచి డబ్బులు తీసుకున్నప్పుడు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ వ్యయాలు పెరగడంతో ఈ ఛార్జీలను పెంచుకునేందుకు ఆర్బీఐ బ్యాంకులకు అనుమతినిచ్చింది.
ఐసీఐసీఐ బ్యాంకు నగదు లావాదేవీలపై పరిమితిని విధించింది. నగదు జమ వెనక్కి తీసుకునేందుకు మొత్తం 4 ఉచిత లావాదేవీలనే అనుమతించనుంది. ఆ తర్వాత నుంచి ప్రతి లావాదేవీకి 150 రూపాయల రుసుము విధిస్తుంది. మూడో వ్యక్తులు చేసే నగదు జమలపైనా పరిమితులు విధించింది. 25 వేల వరకూ 150 రుసుము వసూలు చేయనుంది. ఆపై జమను అనుమతించదు. ఏడాదికి 25 చెక్కులు ఉచితంగా ఇస్తుంది. ఆ తర్వాత 10 చెక్కులుండే ఒక్కో చెక్బుక్కు 20 రూపాయలు చెల్లించాలి. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్.. ఇక నుంచి అన్ని రోజులూ పని చేస్తుందని ఆర్బీఐ తెలిపింది.ఇది నేటి నుంచి అమలు కానుంది..దీంతో సెలవు రోజు ఉన్నా.. వేతనాలు, పింఛన్లు, డివిడెండ్లు, వడ్డీ చెల్లింపుల్లాంటివీ బ్యాంకులో జమ అవుతాయి. ఈఎంఐలతో పాటు టెలిఫోన్ బిల్లులు, బీమా పాలసీల ప్రీమియం, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడుల్లాంటి వాటికి సెలవు రోజునాడూ బ్యాంకు నుంచి ఆ మొత్తం వెళ్లిపోతుంది.
ఇక, ఇవాళ్టి నుంచి డోర్స్టెప్ సేవలకు ఛార్జీలు విధిస్తున్నట్లు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఇంటివద్దకే సేవలు కోరుకునే కస్టమర్లు ప్రతి సర్వీసుకు 20 రూపాయలకు పైగా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే డోర్స్టెప్ సేవల్లో ఐపీపీబీ సిబ్బంది కస్టమర్ ఇంటికి వెళ్లినప్పుడు లావాదేవీలపై ఎలాంటి గరిష్ఠ పరిమితి లేదని వెల్లడించింది. సాధారణంగా ప్రతి నెల ఆరంభంలో చమురు సంస్థలు వంట గ్యాస్ ధరలు పెంచుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా ఈ ధరలను సవరిస్తుంటారు. అయితే ఇటీవల దేశంలో ఇంధన ధరలు పెరగడంతో… ఇవాళ గ్యాస్ ధరలను కూడా పెంచే అవకాశముంది.