ఇటీవల ఎన్నికల సంఘం (ఈసీ) ఐదు రాష్ట్రాలకు ఎన్నిలక షెడ్యూల్ను విడుదల చేసింది. 7 దశల్లో 5 రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల తేదీలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో గోవాలో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఇప్పటికే ఆమ్ఆద్మీ పార్టీ గోవాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఢిల్లీ సీఎం, ఆమ్ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ గోవా ఓటర్లకు హామీలు గుప్పించారు. ఆమ్ ఆద్మీ పార్టీ గోవాలో అధికారంలోకి వస్తే రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఆయన ప్రకటించారు.
అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో భూమి హక్కులు కల్పిస్తామని కేజ్రీవాల్ అన్నారు. ప్రతి గ్రామంలో మొహల్లా ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. 18 ఏళ్లు దాటిన మహిళకు ప్రతి నెల రూ.వెయ్యి సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యటక రంగం అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. గోవాలో 24 గంటల విద్యుత్, నీటి సదుపాయం కల్పిస్తామన్నారు.