కర్నాటక ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో వణికిపోతోంది. కర్నాటకలోని బెంగళూరులో కోవిడ్ క్వారంటైన్ తీసుకుంటున్న ఇద్దరికి ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు కేంద్రం నిర్ధారించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. వీరిలో ఓ వ్యక్తి దక్షిణాఫ్రికా జాతీయుడు కాగా.. మరో వ్యక్తిని బెంగళూరు వాసిగా గుర్తించారు.
బెంగళూరు వాసి నుంచి మరో ఐదుగురికి వ్యాపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో కర్నాటకలో కఠిన ఆంక్షలు అమలుచేయాలని నిర్ణయించింది. కోవిడ్ వ్యాక్సినేషన్ డబుల్ డోస్ సర్టిఫికెట్ వుంటేనే కాలేజీలు, మాల్స్, సినిమా థియేటర్లలోకి అనుమతిస్తారు. ఆర్టీ పీసీఆర్ రిపోర్ట్ వుంటేనే విమానాశ్రయాల్లోకి ఎంట్రీ వుంటుంది. వీటితో పాటు కోవిడ్ ప్రోటోకాల్స్ కఠినతరం చేసింది. కర్నాటక రెవిన్యూ మంత్రి ఆర్ అశోక ఈ మేరకు ప్రకటన చేశారు.
ఒమిక్రాన్ వేరియంట్ వీరవిహారం చేస్తున్న నేపథ్యంలో జనం ఎక్కువగా గుమిగూడే ప్రాంతాలపై ఫోకస్ పెట్టామన్నారు. సినిమా హాల్స్, ఆస్పత్రులు, పాఠశాలలు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లలో ఫిజికల్ క్లాస్లు నిర్వహించేవారు కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు డోస్లు వ్యాక్సిన్ వేయించుకున్నవారు మాత్రమే వీటిలోకి అనుమతిస్తారు. 18 ఏళ్ళు దాటినవారికి ఈ నిబంధన వర్తిస్తుంది. కాలేజీలు, స్కూళ్లలో జనం గుమిగూడడంపై నిషేధం విధించారు. పెళ్ళిళ్ళకు భారీగా జనాన్ని సమీకరించడంపై ఆంక్షలు వున్నాయన్నారు మంత్రి అశోక.
బెంగళూరులో ఓమిక్రాన్ వైరస్ సోకినట్లు గుర్తించిన వారిలో ఒకరి నుంచి మరో ఐదుగురు ప్రాథమిక కాంటాక్ట్ లకు కూడా వైరస్ సోకింది. ఈ ఐదుగురూ కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ప్రభుత్వం అప్రమత్తమై ఆంక్షలు విధించింది. కోవిడ్ పాజిటివ్ పేషంట్లకు కూడా వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. అసలే ఓమిక్రాన్ వైరస్ గతంలో వచ్చిన అన్ని కోవిడ్ వేరియంట్ల కంటే వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని డబ్లూహెచ్ వో హెచ్చరించింది. దీంతో కర్నాటక ప్రభుత్వం వ్యాక్సినేషన్ పై ఫోకస్ పెంచింది. రెండుడోస్లు తీసుకోనివారు వెంటనే రెండవ డోస్ తీసుకోవాలని సూచించింది.