కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ ప్రమాదకరమైనదే. కానీ, దాని గురించి అప్పుడే అతిగా భయపడటం మంచిది కాదు. దాని తీవ్రతపై ఇంకా శాస్ర్తీయ స్పష్టత రాలేదు. లక్షణాలను నిర్థారించాల్సి వుంది. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఆ పనిలోనే ఉన్నారు. ఇంకో రెండు వారాలలో కొత్త వేరియంట్పై అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఒమైక్రాన్ రాకతో దేశంలో మరోసారి కలకలం మొదలైంది. మళ్లీ కరోనా సీజన్ మొదలైందనిపిస్తోంది. అక్టోబర్, నవంబర్లో సెకండ్ వేవ్ కేసులు గణనీయంగా తగ్గాయి. పండగల సీజన్ కావటంతో సహజంగానే థర్డ్ వేవ్ అవకాశాలు ఎక్కువ. కానీ అలా జరగలేదు. పైగా, కొత్త కేసుల సంఖ్య బాగా తగ్గింది. వారం రోజుల సగటు ఏడు వేలకు దిగవకు పడివటం దానికి సూచన. మరోవైపు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతమైంది. ఇవన్నీ చూసి మనం థర్డ్ వేవ్ ముప్పు నుంచి బయటపడ్డామా అని అనిపించింది.
మరోవైపు, జనం కరోనా గురించి పట్టించుకోవటమే మానేశారు. ముఖానికి మాస్కులు ధరించే వారు తక్కువయ్యారు. భౌతిక దూరం అనేద కనిపించట్లేదు. పండుగలు..శుభకార్యాలలో గుంపులు గుంపులుగా గుమికూడారు. ఒక్కమాటలో చెప్పాలంటే కరోనా ముందు నాటి జీవన శైలికి వెళ్లారు. ఐతే, పది రోజుల క్రితం దక్షిణాఫ్రికాలో కరోనా కొత్త వేరియంట్ వెలుగు చూడటటంతో కథ మొదటికి వచ్చింది. మరోసారి థర్డ్ వేవ్ భయాలు మొదలయ్యాయి.
సాధారణంగా ఒక వేరియంట్ మొదటి కేసు వెలుగు చూసిన మూడు వారాలలో అన్ని దేశాలకు వ్యాపిస్తుంది. ఒమైక్రాన్ ఇప్పటికే 38 దేశాలకు పాకింది. అత్యధిక మ్యుటేషన్లు కలిగిన ఈ వేరియంట్పై అనేక రకాల వార్తలు వస్తున్నాయి. ఐతే, ప్రపంచ ఆరోగ్యం సంస్థ మాత్రం ఇది ప్రమాదకరమైన వేరియంట్ అని మాత్రం ప్రకటించింది. అంతకు మించి దీని లక్షణాలపై ఏ అధికారిక ప్రకటన లేదు.
మరోవైపు, ఒమైక్రాన్పై రకరకాల వార్తలు వస్తున్నాయి. డెల్టా కన్నా చాలా వేగంగా వ్యాపిస్తుందని, వ్యాక్సిన్లు కూడా దీని ముందు పనిచేయవని..ఇలా రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అన్నీ నిరాధారమైన వార్తలే. శాస్త్రవేత్తలకే ఇంకా దీని గురించి పూర్తిగా తెలియదు. సోషల్ మీడియాలో మాత్రం అంతా వైరాలజిస్టుల్లా మాట్లాడుతున్నారు. ఒమైక్రాన్ ఎంతదూరం వెళుతుందో చూడాల్సి వుంది.
మనం రెండు సార్లు కరోనాను ఎదుర్కొన్నాం. మొదటి సారి అత్యంత పగడ్బంధీగా మహమ్మారిని కట్టడిచేశాం. కానీ, సెకండ్ వేవ్లో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. మహమ్మారి పునరాగమనం విషయంలో సంసిద్ధత కొరవడింది. పాలకుల అతి విశ్వాసానికి సామాన్యులు బలయ్యారు. కానీ, ఒమైక్రాన్ విషయంలో అలా జరగకపోవచ్చు. ఎందుకంటే, కొత్త వేరియంట్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సన్నద్ధతతో ఉన్నట్టు కనిపిస్తోంది. గత అనుభవం రీత్యా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందే అప్రమత్తమైంది.
ఐతే, ఎవరు ఎన్ని చెప్పినా ప్రజలలో కొన్ని భయాలు, సందేహాలు ఉంటాయి. వాటిని తీర్చాల్సి బాధ్యత ప్రభుత్వాలది. అలాంటి కొన్ని సందేహాలను కేంద్రం నివృత్తి చేసింది. ఇప్పటి వరకు ఒమిక్రాన్ తీవ్రతపై స్పష్టమైన సమాచారం లేదని స్పష్టం చేసింది. డెల్టా వేరియంట్ వల్ల చాలా మందిలో రోగనిరోధకశక్తి వృద్ధి అయింది. దీనివల్ల ఒమిక్రాన్ తీవ్రత దేశంలో తక్కువగానే ఉండొచ్చని పేర్కొంది. ఐతే, దీనిపై శాస్త్రీయ ఆధారాలను విశ్లేషించాల్సి ఉన్నదని పేర్కొంది.
మరోవైపు, ఒమైక్రాన్ కారణంగా ఇప్పటి వరకు ఎటువంటి మరణాలు సంభవించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అలాగే ఈ వేరియంట్ తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని అంటోంది. భారత్ సహా ఇప్పటి వరకు 38 దేశాలలో ఒమైక్రాన్ ఉనికి బయటపడింది. ఈ దేశాలన్నిటిలో కలిపి ఇప్పటి వరకు నాలుగు వందల కేసులు నమోదయ్యాయి. భారత్లో రెండు ఒమైక్రాన్ కేసులు వెలుగు చూశాయి. ఈ రెండు కేసులూ బెంగళూరులోనే బయటపడ్డాయి.
శుక్రవారం నాటికి ప్రపంచంలో అత్యధికంగా దక్షిణాఫ్రికాలో 183 ఒమైక్రాన్ కేసులు రికార్డయ్యాయి. దాని తరువాత అత్యధికంగా యూకేలో 32, ఘనా – 33 ఒమైక్రాన్ కేసులు రికార్డయ్యాయి. ఇది ఇలావుంటే, దక్షిణాఫ్రికాలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తాజా రోజు వారి కేసుల సంఖ్య 16 వేలు దాటింది. మరోవైపు, జర్మనీని మరోసారి కరోనా అతలాకుతలం చేస్తోంది. ప్రతి రోజు 70 వేలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. నిత్యం కనీసం మూడు నాలుగు వందల మంది మహమ్మారి బారినపడి చనిపోతున్నారు.
ప్రపంచ దేశాల పరిస్థితి చూస్తుంటే మనం థర్డ్ వేవ్ను కొట్టిపారేయటం తెలివితక్కువతనమే అవుతోంది. కాబట్టి టీకాల విషయంలో అనుమానాలు వీడాలి. అవి ఒమిక్రాన్పై పనిచేయవు అనడానికి ఆధారాలు లేవు. దీని వ్యాప్తి, మ్యూటేషన్లను బట్టి దీనిని ఆందోళన కలిగించే వాటి జాబితాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేర్చింది. కాబట్టి దీని పట్ల అశ్రద్ధ పనికిరాదు..బాధ్యతారాహిత్యం అంతకన్నా మంచిది కాదు. కొవిడ్ నియమాలు పాటిస్తే ముప్పు నుంచి బయటపడవచ్చని భారత ప్రభుత్వం చెపుతోంది. కాబట్టి ఒమైక్రాన్ విషయంలో భయాలు వీడి జాగ్రత్తలు పాటించాలి.
-Dr.Ramesh Babu Bhonagiri