రాయలసీమ వరప్రదాయనిగా భావించే హంద్రీనీవా సుజల స్రవంతి(హెచ్ఎన్ఎస్ఎస్) విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఒకవైపు భూసేకరణ ఇబ్బందులు, మరోవైపు పనులు ముందుకు సాగడం లేదు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక పాత టెండర్లు రద్దుచేసి కొత్త టెండర్లు పిలిచారు. అయితే పనులు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. నాలుగు జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ఎన్టీఆర్ హయాంలో ఈ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. 1987 లో ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు. ఆతర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో పనులు జరిగాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులు ఆపాలని కేఆర్ఎంబీకి లేఖ రాసింది.