తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ నిబంధనలను కఠినతరం చేస్తూ శనివారం నాడు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో జనవరి 10 వరకు ర్యాలీలు, బహిరంగసభలపై నిషేధం విధించింది. తెలంగాణలో కోవిడ్ పరిస్థితులపై సీఎస్ సోమేష్ కుమార్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ఈ జీవోను జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు.
Read Also: తెలంగాణ మరో ఘనత.. ఆ విషయంలో దేశంలోనే టాప్
కరోనా కట్టడి కోసం రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సభలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని అధికారులను సీఎస్ సోమేష్ కుమార్ ఆదేశించారు. అన్ని దుకాణాలు, షాపింగ్ మాళ్లలో ప్రజలు భౌతిక దూరం పాటించాలని, మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సీఎస్ సూచించారు. విద్యాసంస్థల్లోనూ విద్యార్థులు, సిబ్బంది మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మాస్క్ ధరించనివారిపై రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ఆయన హెచ్చరించారు.