ఒకవైపు కరోనా, మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాపకింద నీరులా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే 1700 కేసులు దాటిపోయి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది ఒమిక్రాన్ మహమ్మారి. తీవ్రత తక్కువగానే వున్నా జనం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా వుంటే.. దేశంలో వారం రోజుల్లో 5 రెట్లు పెరిగాయి కోవిడ్ కేసులు.
గోవా వీధుల్లో బాగా బీచ్ సమీపంలో తీసిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అసలు కోవిడ్ వీరవిహారం చేస్తున్న వేళ వేలాదిమంది న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. ఇసుకేస్తే రాలనంత రద్దీ కనిపించడం, కోవిడ్ నియమాలు గోవా దగ్గరున్న సముద్రాన కలిసిపోయాయి. దీంతో రాబోయే రోజుల్లో కోవిడ్, ఒమిక్రాన్ కి గ్రాండ్ వెల్ కం చెప్పినట్టు అవుతుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. కొత్త ఏడాది వేళ వేలాదిమంది గోవాకు చేరుకున్నారు. అక్కడ సేద తీరేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు రావడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
ఒమిక్రాన్ విస్తరిస్తుండడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు విధించాయి. గోవా ప్రభుత్వం కఠిన ఆంక్షలు జారీ చేసింది. టీకా ధ్రువపత్రం, నెగెటివ్ ఆర్టీపీసీఆర్ నివేదిక ఉంటేనే ప్రజల్ని అనుమతించాలని హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాసినోలకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షల మధ్యనే కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు వేల సంఖ్యలో ప్రజలు బీచ్లు, నైట్క్లబ్స్, పబ్స్కు తరలివచ్చారు. కొవిడ్ పరిస్థితుల్ని తేలిగ్గా తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నా ఈ జనసందోహాన్ని గమనిస్తే పట్టించుకోవడం లేదని అర్థం అవుతోంది. నిబంధనలు గోవాలో వర్తించవా అని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. గోవాలో నిన్న మొన్నటివరకూ పదుల సంఖ్యలో వున్న కోవిడ్ కేసులు ప్రస్తుతం 400కి చేరువలో వున్నాయి. ఒమిక్రాన్ కేసు ఒక్కటే వుంది. కోవిడ్ వల్ల మనదేశంలో 4,81,893 మంది మహమ్మారికి బలయ్యారు. అయినా ప్రజల్లో మార్పురాకపోవడం గమనార్హం.