ఇండియాలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ ఛైర్మన్ డా. ఎన్కే అరోరా స్పష్టం చేశారు. ముంబై, ఢిల్లీ, కోల్కతాలో నమోదవుతున్న కేసుల్లో 75 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్వే అని ఆయన తెలిపారు. గత ఏడాది డిసెంబర్ తొలి వారంలో మొదటి ఒమిక్రాన్ కేసును గుర్తించగా రెండు వారాల్లోనే ఈ వేరియంట్ దేశమంతటా వ్యాపించిందని పేర్కొన్నారు.
డిసెంబర్ తొలివారం నుంచి చివరి వారం వరకు దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 12 శాతం ఒమిక్రాన్వే ఉన్నాయన్నారు. తదుపరి వారంలోనే 28 శాతానికి ఒమిక్రాన్ కేసులు పెరిగాయన్నారు. దీనిని బట్టి దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని చెప్పవచ్చని అభిప్రాయపడ్డారు.
Read Also: ఢిల్లీని వణికిస్తున్న కొత్త వేరియంట్
మరోవైపు దేశంలో గత నాలుగైదు రోజులుగా అధిక సంఖ్యలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయని కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడమే ఉత్తమ మార్గమని సూచించింది. కరోనా కాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు వ్యాక్సిన్ పనితీరుపై ఎన్నో ప్రయోగాలు, పరిశోధనలు జరిగాయని… వీటి ఫలితంగా వ్యాక్సిన్ జీవిత కాలం 12 నెలల వరకు మెరుగుపడిందని కోవిడ్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ ఛైర్మన్ డా. ఎన్కే అరోరా వివరించారు.