తెలంగాణలో చలి మళ్లీ విజృంభిస్తోంది. ఇప్పటికే పలుచోట్ల తక్కువ స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున అత్యల్పంగా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు చలి అధికంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగుజాగ్రత్తలు వహించాలని వారు సూచించారు.
Read Also: బీ అలర్ట్… దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైంది
మరోవైపు సోమవారం నాడు ఆదిలాబాద్లో 12.8, మెదక్లో 12.9, కరీంనగర్లో 13, హనుమకొండలో 14, హైదరాబాద్లో 15.3, రామగుండంలో 15.4, నిజామాబాద్లో 16.9, నల్గొండలో 17, మహబూబ్నగర్లో 18, ఖమ్మంలో 20 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు ఏపీలోని విశాఖ ఏజెన్సీలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో తగ్గిపోయాయి. మినుములూరులో 6 డిగ్రీలు, పాడేరులో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు గజగజ వణికిపోతున్నారు.