దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే దేశంలో 293 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 17 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నాయి. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలను దృష్టిలో పెట్టుకొని కోవిడ్, ఒమిక్రాన్ కట్టడికి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం మరోసారి సూచించింది. ఒమిక్రాన్ కట్టడిపై కేంద్రం అలర్ట్ అయింది. కేసుల పెరుగుదలపై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఒమిక్రాన్ పట్ల అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని ఆదేశించింది. ఎక్కువ కేసులున్న కోవిడ్ క్లస్టర్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, కోవిడ్ క్లస్టర్లలో కంటైన్మెంట్, బఫర్ జోన్లను ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది.
Read: లైవ్: నాని వ్యాఖ్యలపై నట్టి కుమార్ కౌంటర్
కంటైన్మెంట్ ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూను విధించాలని ఆదేశించింది. పండుగల సీజన్లో ఆంక్షలు, పరిమితులను విధించాలని, ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. అర్హులైన అందరికీ కోవిడ్ వ్యాక్సన్ను ఇవ్వాలని, కోవిడ్ వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించాలని కేంద్రం సూచించింది. ఇక ప్రజలందరూ మాస్క్లు ధరించేలా చూడాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.