తెలుగు చిత్రపరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎన్నో వైవిధ్యభరితమైన పాటలను అందించిన పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గత కొన్ని రోజుల అస్వస్థతకు గురై కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఈ రోజు సాయంత్రం ఆయన తుదిశ్వాస విడిచారు. హ్యట్రిక్గా నంది అవార్డులు అందుకున్న సిరివెన్నెల మన మధ్యలేరని విషయం తెలియడంతో ప్రముఖ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
సిరివెన్నెల మృతిపై స్పందించిన నందమూరి బాలకృష్ణ.. ‘సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల గారు. తెలుగు పాటని తన సాహిత్యంతో దశదిశల వ్యాపింపజేసిన ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు నాకు ఎంతో ఆప్తులు. నేను నటించిన చిత్రాలకు వారు అద్భుతమైన పాటలు రాయడం జరిగింది. సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని కలిగించిన వ్యక్తి సిరివెన్నెల గారు. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం చాలా భాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతున్ని కోరుకుంటూ.. వారి కుంటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని వెల్లడించారు.