ఏపీలో జగన్ పాలనపై బీజేపీ ఎంపీలు మండిపడ్డారు. వైసీపీకి ఎందుకు ఓటేశామని లెంపలేసుకుంటున్న పరిస్థితి వుందన్నారు ఎంపీ సుజనా చౌదరి. అప్రజాస్వామికంగానే అధికార పార్టీ స్థానిక సంస్థలను చేజిక్కించుకుంది.ఏ ఒక్క మంత్రి ఏం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. జగన్ ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయిలో జరుగుతోందో ప్రజలకు అర్ధమైంది. తమకు బీజేపీ ఆశీస్సులున్నాయని వైసీపీలో కొందరు నేతలు చెప్పుకుంటున్నారు.. అదంతా అబద్దం. వైసీపీ మాకు శత్రువు కాదు కానీ.. రాజకీయ ప్రత్యర్ధి అన్నారు సుజనా చౌదరి.
సంక్షేమ పథకాలకే నిధులు ఖర్చు పెడుతున్నారు. కేంద్ర నిధులకు స్టిక్కర్లు వేసి తమ పథకాలుగా జగన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందన్నారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోవడం లేదు. కొన్నింటిని మళ్లిస్తుంది.. ఇంకొన్ని పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్లు కూడా ఇవ్వడం లేదు. భారీ ఎత్తున అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు జీవీఎల్.
ఈ ప్రభుత్వం దివాళా పరిస్థితిలో ఉందని, కేంద్రం రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తోంది. ఏపీలో బూతుల పురాణం తప్ప.. అభివృద్ధిపై చర్చా లేదు.. పోరాటం లేదు.ఆ ప్రభుత్వం చేపట్టిన పనులను.. ఈ ప్రభుత్వం తాకదు.. ఈ ప్రభుత్వం చేపట్టే పథకాలను పార్టీ ప్రస్తావించదు. అన్ టచ్ బుల్ ప్రభుత్వాలు ఎందుకు.. బీజేపీని ఎన్నుకోండని ప్రజలని కోరుతున్నాం అన్నారు ఎంపీ టీజీ వెంకటేష్.
గజేంద్ర సింగ్ షెకావత్ కామెంట్ల వెనుక కుట్ర ఉందనే ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యం. తప్పు జరిగింది.. మళ్లీ జరగకుండా చూస్తామని చెప్పాల్సింది పోయి రాజకీయం అంటూ మంత్రి కామెంట్లు చేయడం సరికాదు.కేంద్ర మంత్రి కామెంట్లకు దురుద్దేశ్యాలు ఆపాదిస్తే.. కేంద్రంలో ఇబ్బందులు తప్పవు. ప్రతి నెలా ఇదే మంత్రి వద్దకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతునిధులు వెళ్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను ఉన్నాను.. నేను విన్నాను అని జగన్ ఇప్పటి వరకు చెప్పారు.. తీరు మారకుంటే భవిష్యత్తులో నేను మరిచాను అని కూడా చెప్పాల్సి వస్తుందన్నారు టీజీ వెంకటేష్.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం ముగిసింది. ఈ సగం రోజుల పాలనలో అభివృద్ధి శూన్యం అన్నారు ఎంపీ సీఎం రమేష్. కడప స్టీల్ ప్లాంట్ పునాది రాయి వేసి రెండేళ్లు గడిచింది.. కానీ అక్కడ పునాది రాయే మిగిలింది తప్ప.. మరేం ప్రగతి లేదు.ఇసుక అక్రమాలు, మట్కా, గుట్కా, గంజాయి వంటి అక్రమాలు బాగా జరుగుతున్నాయి.ఎస్సీ, ఎస్టీ కేసులు లెక్కకు మిక్కిలిగా పెట్టేస్తున్నారు.కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.. ఆయన పైనా ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతారా..?రాష్ట్రంలో అరాచకం తప్ప మరేం జరగడం లేదు.. దీనికి కారణం పోలీసులు.పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు.ఢిల్లీకి వచ్చి ప్రాజెక్టులు.. పథకాలు అడగడం లేదు ,అప్పులు ఇవ్వాలని కోరుతూ వస్తున్నారు.
ఢిల్లీలో ఏపీ పరువు తీస్తున్నారు.అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుని పోయాక ముందుగా నేనే విజిట్ చేశాను.అన్నమయ్య ప్రాజెక్టు గేటును ఏడాది నుంచి రిపేర్ చేయలేదన్నారు ఎంపీ సీఎం రమేష్. దీని వెనుకా సీఎం రమేష్, సుజనా ఇద్దరూ ఉన్నారా..?నేను వెళ్లెంత వరకు ఎమ్మార్వో కూడా రాలేదు.కడప కలెక్టర్ కూడా పట్టించుకోలేదని విమర్శించారు ఎంపీ సీఎం రమేష్. మొత్తం మీద వరుసగా ప్రెస్ మీట్లు పెట్టి బీజేపీ ఎంపీలు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడడం హాట్ టాపిక్ అవుతోంది.