దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక సంస్థగా పేరున్న సింగరేణి కాలరీస్ ప్రమాదాలకు నిలయంగా మారిందా? యాజమాన్యం కార్మికుల భద్రతను పట్టించుకోవడం లేదా? నల్లబంగారం అందించే కార్మికుల ప్రాణాలకు విలువే లేదా? అంటే అవుననే అనిపిస్తోంది. తాజాగా 10 రోజుల వ్యవధిలో నాలుగు ప్రమాదాలు జరగడం విస్మయం కలిగిస్తోంది. దీంతో సింగరేణిలో ఏం జరుగుతోందని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

కాసిపేట మండలం కల్యాణి ఖని ఉపరితల బొగ్గు గనిలో ప్రమాదం జరిగింది. షవర్ ఆపరేటర్ మట్టి పోస్తుండగా మట్టి కుప్ప కింద పడి అండర్ మేనేజర్ పురుషోత్తం ప్రమాదవశాత్తు మృతిచెందాడు. పది రోజుల వ్యవధిలో మంచిర్యాల జిల్లా సింగరేణిలో నాలుగో ప్రమాదం జరిగింది. శ్రీరాంపూర్లోని ఎస్ఆర్పీ-3 అండర్ గ్రౌండ్ గనిలో నవంబర్ 10న ప్రమాదం జరిగింది. బొగ్గుగని పైకప్పు ఉన్నట్టుండి పెళపెళమంటూ కూలి.. భారీ శిథిలాల రూపం లో విరుచుకుపడింది. దీంతో నలుగురు కార్మికులు సజీవ సమాధి అయ్యారు.
నవంబర్ 10 ఉదయం 10:30 గంటలకు ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో టింబర్మెన్ వి.కృష్ణారెడ్డి (57), బేర లక్ష్మయ్య (60) బదిలీ వర్కర్లు గాదం సత్యనారాయణరాజు (32) రెంకా చంద్రశేఖర్ మృతిచెందారు. మృతదేహాల వెలికితీత కోసం భూపాలపల్లి, రామగుండం, శ్రీరాంపూర్కు చెం దిన సింగరేణి రెస్క్యూ టీమ్ చర్యలు చేపట్టారు. భారీ శిథిలాలు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.
మృతుల కుటుంబాల్లో అర్హులైన ఒకరికి తక్షణమే వారు కోరుకున్న ప్రాంతంలో ఉద్యోగం ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు మ్యాచింగ్ గ్రాంట్, గ్రాట్యూటీ తదితర చెల్లింపులు కలుపుకొని దాదాపు రూ.70 లక్షల నుంచి రూ. కోటి దాకా అందజేశామని సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ ప్రకటించారు. గనుల్లో తరుచుగా ప్రమాదాలు జరుగుతూ కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా యాజమాన్యం రక్షణ చర్యలు తీసుకోవడం లేదు. యాజమాన్యం టార్గెట్లపై చూపుతున్న శ్రద్ధ కార్మికుల రక్షణలో చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మరో ప్రమాదం జరగడంపై కార్మికులు మండిపడుతున్నారు.