2014 నుంచి కునారిల్లుతున్న ఏపీ కాంగ్రెస్పై అధిష్టానం ఫోకస్ పెట్టిందా? త్వరలో సారథి మారనున్నారా? అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి తీసికట్టు నాగంబొట్టు తరహాగా మారింది. అటు అసెంబ్లీ, ఇటు లోక్ సభలోనూ జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. తీరా స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా హస్తవాసి బాగుంటుందా అంటే అలాంటిదేం లేదు. ఏయేటికాయేడు పార్టీ పరిస్థితి దిగజారిపోతోంది. అసలు పార్టీ వుందా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఏపీకి త్వరలో నూతన పీసీసీ అధ్యక్షుడి నియామకం జరగడం ఖాయంగా కనిపిస్తోంది.
ఏపి కాంగ్రెస్ వ్యవహరాల పై దృష్టి సారించిన అధిష్ఠానం నేతల్ని పిలిపించుకుని మాట్లాడుతోంది. రాబోయే రోజుల్లో పార్టీని ఎలా ముందుకు నడిపించాలి? పార్టీ ని బలోపేతం చేసే దిశగా ఏఐసిసి చర్యలు చేపడుతోంది. ఈ నెల 21, 22 తేదీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు ఏపీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ
ఉమన్ చాందీ. సంప్రదింపుల్లో పాల్గొననున్నారు ఇన్ ఛార్జి జనరల్ సెక్రటరీ ఉమన్ చాందీతో పాటు, ఏపీ ఇన్ఛార్జి సెక్రటరీలు మయ్యప్పన్, క్రిస్టోఫర్ తిలక్. ఈ రెండు రోజులూ పలువురు రాష్ట్ర సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరపనున్నారు ఉమన్ చాందీ. నేతలందరినీ విజయవాడకు రావాలని పిలుపునిచ్చారు. త్వరలో రాహుల్ గాంధీ స్వయంగా రంగంలోకి దిగి ఈ మార్పులు చేపట్టనున్నారు. తద్వారా ఏపీ కాంగ్రెస్ కు జవసత్వాలు నింపాలని భావిస్తున్నారని తెలుస్తోంది.
2014 రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికి కోల్పోయింది. 2019 ఎన్నికల్లో మరింత దిగజారింది. కనీసం నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఓట్లు కూడా రాలేదు. ఇటీవల జరిగిన బద్వేలు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ దారుణమయిన ఓట్లు సాధించింది. కేవలం 6,235 ఓట్లు రావడం వారితోపాటు రాజకీయ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసిందనే చెప్పాలి. పార్టీలో చెప్పుకోదగ్గ నేతలు లేరు. నాయకత్వం అంతగా ప్రభావితం చేయలేకపోతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి శైలజానాథ్ అధ్యక్షుడిగా వున్నారు. తెలంగాణ తరహాలోనే ఏపీకి కూడా రెడ్లకు చెందినవారిని అధ్యక్షుడిగా చేస్తారా? ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ధీటుగా ఎదుర్కొనే నేతలు ఎవరనేది అధిష్టానం చర్చిస్తోంది. మరి ఏపీ కాంగ్రెస్ కొత్త సారథి ఎవరవుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.