దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని మూడు లోక్సభ, 29 అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరిగాయి. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు కాసేపట్లో వెలువడనున్నాయి.
అసోం- 5, బంగాల్- 4, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ- 3, బిహార్, కర్ణాటక, రాజస్థాన్- 2, ఆంధ్రప్రదేశ్, హరియాణా, మహారాష్ట్రా, మిజోరాం, తెలంగాణలో ఒక్కో స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. అక్టోబర్ 30న ఉప ఎన్నికలు జరిగిన స్థానాల్లో గతంలో బీజేపీ ఆరు, కాంగ్రెస్ తొమ్మిది, మిగిలినవి స్థానిక పార్టీలు గెలుపొందాయి. తెలుగు రాష్ట్రాల్లో బద్వేల్ స్థానంలో వైసీపీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య ప్రాణాలు కోల్పోయారు. హుజురాబాద్ స్థానంలో తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి.
దాద్రా నగర్ హవేలీ, హిమాచల్ప్రదేశ్లోని మండి, మధ్యప్రదేశ్లోని ఖాంద్వా లోక్ సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆయా స్థానాల్లోని ఎంపీలు మరణించిన క్రమంలో ఉప ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. మండి స్థానంలో బీజేపీ అభ్యర్థి రామస్వరూప్ శర్మ, ఖాంద్వాలో బీజేపీ నేత నంద కుమార్ సింగ్, దాద్రా నగర్ హవేలీలో స్వతంత్ర నేత మోహన్ దెల్కార్ ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. ఈ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికలకు జరిగిన పోలింగ్ అనంతరం మంగళవారం కౌంటింగ్ నిర్వహిస్తున్నారు.